GT vs MI Eliminator: పోరాడి ఓడిన గుజరాత్.. థ్రిల్లింగ్ విక్టరీతో క్వాలిఫయర్ 2కి దూసుకెళ్లిన ముంబై

GT vs MI Eliminator: పోరాడి ఓడిన గుజరాత్.. థ్రిల్లింగ్ విక్టరీతో క్వాలిఫయర్ 2కి దూసుకెళ్లిన ముంబై

ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. శుక్రవారం (మే 30) పంజాబ్ లోని చండీఘర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని సాధించి క్వాలిఫయర్ 2 లో అడుగుపెట్టింది. భారీ ఛేజింగ్ లో సాయి సుదర్శన్ (49 బంతుల్లో 80: 10 ఫోర్లు, సిక్సర్), సుందర్ (24 బంతుల్లో 48: 5 ఫోర్లు, 3 సిక్సర్లు) గుజరాత్ విజయంపై ఆశలు కల్పించినా కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో ముంబై సంచలన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఛేజింగ్ లో గుజరాత్ 20 ఓవర్లలో 208 పరుగులు చేసి ఓడింది. 

229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు తొలి ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. బోల్ట్ వేసిన బంతిని ఫ్లిక్ చేయాలని చూసిన గిల్ (1) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఈ దశలో కుశాల్ మెండీస్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ను ముందుకు  తీసుకెళ్లారు. పవర్ ప్లే లో బౌండరీల వర్షం కురిపిస్తూ దూకుడు కనబర్చారు. దీంతో తొలి 6 ఓవర్లలో గుజరాత్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.  లక్ష్యం వైపుకు దూసుకెళ్తున్న గుజరాత్ కు ఏడో ఓవర్ రెండో బంతికి బిగ్ షాక్ తగిలింది. రెండు సిక్సర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించిన మెండీస్ (20) షాట్ ఆడే క్రమంలో తన కాలు వికెట్లను తగిలింది. దీంతో హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

రెండు వికెట్లు పడినా గుజరాత్ వెనకడుగు వేయలేదు. లక్ష్యం భారీగా ఉండడంతో సాయి సుదర్శన్, వాషింగ్ టన్ సుందర్ రెచ్చిపోయి ఆడి ముంబైకి వణికించారు. అనూహ్యంగా సుందర్ కూడా హిట్టింగ్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో బుమ్రా 14 ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చి సుందర్ వికెట్ తీసి మ్యాచ్ ముంబై వైపుకు తిప్పాడు.  వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 44 బంతుల్లోనే 84 పరుగులు జోడించి లక్ష్యం వైపుగా తీసుకెళ్లారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో సాయి సుదర్శన్ అద్భుతంగా పోరాడాడు. 

28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సుదర్శన్.. 49 బంతుల్లోనే 80 పరుగులు చేసి గ్లేస్సన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. సుదర్శన్ ఔట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా ముంబై చేతుల్లోకి వచ్చింది. చివర్లో రూథర్ ఫోర్డ్(24), టివాటియా (16) పోరాడినప్పటికీ లక్ష్యం మరీ పెద్దది కావడంతో గుజరాత్ కు ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో బోల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, గ్లేస్సన్, సాంట్నర్, అశ్వని కుమార్  తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో ముంబై క్వాలిఫయర్ 2 కు అర్హత సాధించగా.. గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.    

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(50 బంతుల్లో 81:9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు సూర్య కుమార్ యాదవ్(33), బెయిర్ స్టో (47) పవర్ ప్లే లో మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్,ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది.  

తొలి మూడు ఓవర్లలోనే 28 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. ప్రసిద్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్ స్టో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ ఓవర్ లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లో రోహిత్ 14 పరుగులు బాదడంతో పవర్ ప్లే లో ముంబై 79 పరుగులు రాబట్టుకుంది. పవర్ ప్లే తర్వాత ప్రమాదకరంగా మారుతున్న బెయిర్ స్టో (47) వికెట్ తీసుకోవడంతో గుజరాత్ కు బిగ్ రిలీఫ్ లభించింది. 

ఈ దశలో సూర్యతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. వికెట్ పడినప్పటికీ స్కోర్ వేగం తగ్గలేదు. వీరిద్దరూ రెండో వికెట్ కు 59 పరుగులు జోడించి భారీ స్కోర్ కు బాటలు వేశారు. సూర్య 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ కావడంతో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. అద్భుతమైన ఇన్నింగ్స్ తో 50 బంతుల్లో 81 పరుగులు చేసిన రోహిత్ ఆ కాసేపటికే ఔటయ్యాడు. ఉన్నంత సేపు సిక్సర్లతో హోరెత్తించిన తిలక్ వర్మతో పాటు చివర్లో హార్దిక్ పాండ్య (9 బంతుల్లో 22)  హిట్టింగ్ చేయడంతో ముంబై 228 పరుగులకు చేరుకుంది.