నవీ ముంబై: డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మళ్లీ తడబడింది. లీగ్లో మూడో ఓటమి ఖాతాలో వేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ 22 రన్స్ తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది. గత పోరులోనూ ముంబైని ఓడించిన యూపీ ఆ జట్టుపై మరోసారి తన ఆధిపత్యాన్ని చూపెట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 187/8 స్కోరు చేసింది.
కెప్టెన్ మెగ్ లానింగ్ (45 బాల్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 70), ఫోబ్ లిచ్ఫీల్డ్ (37 బాల్స్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61) ఫిఫ్టీలతో విరుచుకుపడ్డారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ 3 వికెట్లు తీసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓవర్లన్నీ ఆడి 165/6 స్కోరు మాత్రమే చేసి ఓడింది. అమేలియా కెర్ (49 నాటౌట్), అమన్జోత్ కౌర్ (41) ఆదుకునే ప్రయత్నం చేసినా.. ముంబైకి ఓటమి తప్పలేదు. లానింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది.
