- మున్సిపాలిటీల్లో ర్యాలీలతో హోరెత్తుతున్న ప్రచారం
- ఏ వాడలో చూసినా డప్పు చప్పుళ్లు, డీజే పాటల మోతలు
కరీంనగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడనుంది. ప్రచార గడువు దగ్గరపడడంతో ఆదివారం ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ప్రచారం హోరెత్తుతోంది. ర్యాలీలు, స్ర్టీట్ కార్నర్ మీటింగ్స్, అభ్యర్థుల ఇంటింటి ప్రచారం, డప్పుచప్పుళ్లు, డీజే పాటల మోతలతో హోరెత్తాయి. ఆదివారం హాలీ డే కావడం, చాలా మంది ఇళ్లలో ఉండడంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి ఎక్కువగా ప్రయార్టీ ఇచ్చారు. ఏ వాడలో చూసినా ఏదో ఒక పార్టీ, ఎవరో ఒక అభ్యర్థి ప్రచార సందడి కనిపించింది. ఏ పార్టీ మీటింగ్ అయినా, ర్యాలీ నిర్వహించిన వందలు, వేలల్లో జనం తరలివస్తున్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, వేములవాడ మున్సిపాలిటీల్లో జిల్లా ఇన్ చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొప్పదండి మున్సిపాలిటీ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ క్యాండిడేట్ల తరఫున ప్రచారం చేశారు. రాత్రి కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని రెవెన్యూ గార్డెన్స్ నుంచి టవర్ సర్కిల్ వరకు వేలాది మంది కార్యకర్తలు, జనంతో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో కార్నర్ మీటింగ్స్ లో ప్రచారం నిర్వహించారు.
