- మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థుల సరికొత్త ప్లాన్స్
- మహిళల ఓట్ల కోసం చీరలు పంపిణీ
- స్లమ్ ఏరియాల్లో నెలవారీ నిత్యావసర సరకులు ఇంటింటికీ రహస్యంగా అందజేత
- యూత్కు క్రికెట్ కిట్స్, రాత్రి పూట చికెన్, మటన్ లతో దావత్లు
నల్గొండ, వెలుగు: మున్సిపల్ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో ఓటర్లు మీరే మా దేవుళ్లు అంటూ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా సరే తమకే ఓటు వేయాలంటూ ఆకర్షించే వ్యుహాలతో ముందుకు వెళుతున్నారు. పట్టణాల్లోని కాలనీల్లోని వార్డుల వారీగా, స్లమ్ ఏరియాల్లో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. బియ్యం, నూనె, పప్పులు, చక్కెర లాంటి సరకుల ప్యాకెట్లుగా ఓటర్ల ఇళ్లకు చేర్చుతూ ప్రచారం చేస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించాలన్న లక్ష్యంతో అభ్యర్థులు ఖర్చుకు వెనకాడడం లేదు. మహిళలు, పేదలు, యువ ఓటర్లే టార్గెట్గా వ్యూహాలు అమలు చేస్తున్నారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు..
ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా దావత్లు, నిత్యావసర సరుకుల పంపిణీ జోరుగా సాగుతోంది. పట్టణాలు, కాలనీల్లో సాయంత్రం వేళల్లో డాబాలపై మందు బాటిళ్లతో పార్టీలు ప్రారంభమయ్యాయి. వార్డుల వారీగా ప్రచారాలు ఊపందుకున్నాయి. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు చికెన్, మటన్, మందుతో దావత్లు ఇస్తున్నారు. ప్రత్యర్థుల కంటే ముందుండాలన్న తపనతో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో జన సమూహాల్లో విందులు ఏర్పాటు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి, ఓటు మనదే.. అభ్యర్థి మనవాడే అన్న భావన కల్పించేందుకు ఈ దావత్లు ఉపయోగపడుతున్నాయన్న చర్చ జరుగుతోంది.
యూత్, మహిళలే టార్గెట్
ఎన్నికల అభ్యర్థులు యూత్, మహిళలే టార్గెట్గా అభ్యర్థులు ముందుకుపోతున్నారు. ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి హామీల కంటే దావత్లు, పంపిణీలే ప్రచారానికి ప్రధాన ఆయుధంగా మారినట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థులతో పోటీపడి ఖర్చుకు వెనకాడకండా అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని శివారు వార్డుల్లో ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి1200 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. యూత్ కోసం క్రికెట్ కిట్ లను సైతం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
సూర్యాపేటలోని ఒక ప్రధాన పార్టీకి చెందిన చైర్ పర్సన్ అభ్యర్థి తన వార్డులో ప్రచారానికి బయట నుంచి తీసుకురావడమే కాకుండా తన ఇంటికి సమీపంలో రాత్రి చికెన్, మటన్, మందు దావత్ పెట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. నల్గొండ కార్పొరేషన్ లో సైతం రాత్రి జోరుగా దావత్ లు జోరుగా నడుస్తున్నాయి. మిర్యాలగూడలో ఒక ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి తన వార్డుల్లో నెలకు సరిపడా నిత్యావసర సరకులు ఓటర్ల ఇంటికి చేరవేస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో నెగ్గాలని ప్రచారంలో భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.
