- జీడిమెట్లలో జరిగిన వివాహిత మర్డర్ కేసులో ట్విస్ట్
- మాజీ ప్రియుడు చంపినట్లు నమ్మించిన దంపతులు
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: నాలుగు రోజుల కిందట జరిగిన వివాహిత మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓనర్ దంపతులు ఆమెను హత్య చేసినట్లు తేల్చారు. మాజీ ప్రియుడు చంపినట్లుగా డ్రామా క్రియేట్ చేసిన నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన దంపతులు రింకు యాదవ్(24), సంజీత్ యా దవ్(35) జీడిమెట్ల వినాయక్ నగర్ లో ఉంటున్నారు. బిహార్ కి చెందిన రాజేశ్ వర్మ(27) ఐదేండ్లుగా వీరి ఇంట్లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రాజేశ్ కు రింకుతో పరిచయమై వివాహేతర సంబంధంగా మారింది. దీంతో రాజేశ్ ఆమె ఇంటి ఖర్చులన్నీ భరించేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో రాజేశ్ కి జార్ఖండ్ కు చెందిన పూజా వర్మ(21)తో పెళ్లైంది. అప్పటి నుంచి రింకు దంపతులను రాజేశ్ దూరం పెట్టాడు. దీంతో రింకు దంపతులకు అప్పులు పెరిగిపోయాయి. రాజేశ్ ఇల్లు మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు తెలుసుకుని అతని భార్య పూజా వర్మను హత్య చేసేందుకు స్కెచ్ వేశారు. ఈ నెల 10న రింకు దంపతులు కలిసి పూజా వర్మ మొహంపై దిండుతో అదిమిపెట్టి చంపేసి, ఒంటిపై ఉన్న నగలను దొంగిలించారు. పూజా వర్మ ప్రియుడు మరో ఫ్రెండ్ తో జార్ఖండ్ నుంచి వచ్చి హత్య చేసి నగలతో పారిపోయినట్లు రింకు దంపతులు పోలీసులు, స్థానికులను నమ్మించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయగా హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.