- రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ
హైదరాబాద్, వెలుగు: పీఎం కుసుమ్ స్కీం ద్వారా రైతులు తమ వ్యవసాయ భూముల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ ప్రదాతలుగా మారిపోతున్నారని రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల సందర్భంగా గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల గ్రామంలో ఇంధన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నదన్నారు.
ఈ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ, బంజరు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, ఉత్పత్తి అయ్యే విద్యుత్ను డిస్కంలకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 10,642 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో ఉందని, దీన్ని 2029–30 నాటికి 29,645 మెగావాట్లకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని వెల్లడించారు.
