- షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల
హైదరాబాద్, వెలుగు : షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలో మటన్ క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. మంగళవారం ఫెడరేషన్ యానివల్ రిపోర్ట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్చేశారు. ఈ సందర్భంగా దూదిమెట్ల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం అన్నీ రాష్ట్రాల ప్రశంసలు పొందిందన్నారు. పశువుల కోసం ప్రత్యేక అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గొర్రెల పెంపకదారులు ప్రమాదవశాత్తు చనిపోతే ఫెడరేషన్ ద్వారా లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా అందిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో గొర్రెలు మేకల పెంపకదారులందరికీ పెన్షన్, జీవాలకు ఇన్సూరెన్స్ కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రాంచందర్, పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ మంజువాణి, డాక్టర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.