గచ్చిబౌలి, వెలుగు : నో ఎంట్రీ సమయాల్లో తిరిగే ప్రైవేటు బస్సులు, కన్స్ట్రక్షన్ వెహికల్స్, స్కూల్ బస్సుల కోసం సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక యాప్ను రూపొందించారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్రావు ప్రైవేట్ బస్సులు, కన్స్ట్రక్షన్ వెహికల్స్, ప్రైవేటు స్కూల్ బస్సుల ఓనర్లతో సమావేశం నిర్వహించారు. ‘మై ట్రాన్స్పోర్ట్ ఈజ్ సేఫ్ యాప్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నో ఎంట్రీ సమయాల్లో తిరిగే ప్రైవేట్ బస్సులు, రెడీమిక్స్ లారీలు, కన్ స్ట్రక్షన్ వెహికల్స్, స్కూల్ బస్సుల కోసం ప్రత్యేక స్టిక్కర్లు రూపొందించామన్నారు.
ట్రాఫిక్ రద్దీ, రోడ్డు భద్రతా దృష్ట్యా.. అవసరమైన వెహికల్స్కు, సెలక్టెడ్ రూట్ లో మాత్రమే పర్మిషన్ తీసుకోవాలన్నారు. భారీ వెహికల్స్ కు ఉదయం 7.30 నుంచి 11.30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు మధ్యలో అనుమతి లేదన్నారు. నో ఎంట్రీ సమయాల్లో ప్రత్యేక అనుమతి ఉన్న వెహికల్స్ కు ఈ స్టిక్కర్లను ఇస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ హనుమంతరావు, అధికారులు పాల్గొన్నారు.