అరంగేట్రంతోనే అసెంబ్లీకి.. మైనంపల్లి రోహిత్ రావు

అరంగేట్రంతోనే అసెంబ్లీకి.. మైనంపల్లి రోహిత్ రావు

మెదక్​, వెలుగు: ఎన్నికలకు దాదాపు ఆరు నెలల ముందు రాజకీయరంగ ప్రవేశం చేసిన మైనంపల్లి రోహిత్ రావు ​ఎమ్మెల్యేగా గెలుపొంది సంచలనం సృష్టించారు. నియోజకవర్గ చరిత్రలో 26 ఏళ్ల వయసులోనే అసెంబ్లీలో అడుగుపెడుతూ మరో రికార్డు సృష్టించారు. మల్కాజ్​గిరి ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు..​ మైనంపల్లి సోషల్​ సర్వీస్​ ఆర్గనైజేషన్​ (ఎంఎస్​ఎస్​ఓ) చైర్మన్​గా ఉన్న తన కొడుకు మైనంపల్లి రోహిత్​ రావును ఎమ్మెల్యే చేయాలనే ఆకాంక్షతో గత ఫిబ్రవరిలో మెదక్​ నియోజకవర్గంలో రీఎంట్రీ ఇచ్చారు.

గత ఏప్రిల్​ నెల నుంచి నియోజకవర్గంలో ఎంఎస్​ఎస్​ఓ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. తద్వారా ప్రజల మద్దతు కూడగట్టుకున్న రోహిత్​ రావు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్​ స్థానంలో పోటీ చేసేందుకు బీఆర్​ఎస్​ టికెట్​ ఆశించారు. అయితే బీఆర్ఎస్​ హైకమాండ్​ సిట్టింగ్​ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్​ టికెట్ ఆశించి భంగపడ్డ రోహిత్​రావు తండ్రి హన్మంతరావు​తో కలిసి కాంగ్రెస్​లో చేరగా ఆ పార్టీ  హైకమాండ్ అతడికి మెదక్ టికెట్​ ఇచ్చింది.  

ఇదివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, విశేష రాజకీయ అనుభవం ఉన్న బీఆర్ఎస్​ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్​ రెడ్డితో తలపడిన రోహిత్​రావు 10,157 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. కాంగ్రెస్​ టికెట్ ఆశించి భంగపడ్డ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్​రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు, టీపీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ పార్టీని వీడి బీఆర్ఎస్​లో చేరారు. ముఖ్యమైన నాయకులు అందరూ వెళ్లిపోయినప్పటికీ  రోహిత్ రావు ఒంటరి పోరు చేసి విజయం సాధించారు.