టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. భోగస్ సర్వేలతో కాంగ్రెస్ ను నాశనం పట్టించారని మండిపడ్డారు. ఫేక్ సర్వేల పేరు చెప్పి రేవంత్ టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్లను కాదని.. నిన్న మొన్న వచ్చిన పారాచూట్ నాయకులకు టికెట్లు ఇవ్వడం బాధాకరమన్నారు. తనకు ఏ కారణంతో టికెట్ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదన్నారు.
తనకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడికి వెళ్తానన్నారు నాగం జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు పార్టీని ఉత్తేజపరిచి కార్యకర్తలను అక్కున చేర్చుకొని అందరిని ఒక తాటిపైకి తెచ్చిన తర్వాత నాకు టికెట్ ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని ఒక స్థాయికి తీసుకెళ్లిన తర్వాత కొత్త వాళ్లకు టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తన నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
నాగం జనార్థన్ రెడ్డి బీఆర్ఎసస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 29న సాయంత్రం కేటీఆర్ నాగం జనార్థన్ రెడ్డిని కలవనున్నారని .. మరో రెండు రోజుల్లో కేసీఆర్ సమక్షంలో నాగం బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.