రూ. 10వేల కోట్లతో ఖమ్మంను అభివృద్ధి చేశాం : నామా నాగేశ్వరరావు

రూ. 10వేల కోట్లతో ఖమ్మంను అభివృద్ధి చేశాం :  నామా నాగేశ్వరరావు

భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు: తన హయాంలో దాదాపు రూ. 10వేల కోట్ల నిధులతో ఖమ్మం పార్లమెంట్​పరిధిలో పలు అభివృద్ధి పనులు చేశామని బీఆర్​ఎస్​ ఖమ్మం పార్లమెంట్​ అభ్యర్థి, పార్టీ పార్లమెంటరీ పక్ష నేత  నామా నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి బీఆర్​ఎస్​ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని కొత్తగూడెంలోని పార్టీ ఆఫీస్​లో  మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు.  

అనంతరం అశ్వారావుపేటలోని ఊట్లపల్లి రోడ్డు మూడో కిలోమీటర్ రాయి పామాయిల్ తోట వద్ద మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నామా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బీజేపీ, కాంగ్రెస్​ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్​లో మాట్లాడింది లేదన్నారు. ప్రజల్లో బీఆర్​ఎస్​ స్థానం చెరిగిపోలేదని చెప్పారు. 

కొంత మంది నేతలు పోయినంత మాత్రానా పార్టీకి పెద్దగా నష్టమేమీ ఉండదన్నారు. పార్టీలకతీతంగా తనకు ఓట్లు వస్తాయన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణం, గోదావరి నీళ్లను లిఫ్ట్​ చేసి వ్యవసాయానికి నీళ్లు ఇచ్చినందునే దేశంలో వరి పండించడంలో నంబర్​ వన్​ స్థానంలో నిలిచామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు తాగు, సాగు నీటి కోసం ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్​ పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

పాలేరు ఎండిపోయిందని,  ఖమ్మంలో తీవ్ర స్థాయిలో తాగునీటి ఎద్దడి నెలకొందని చెప్పారు. పంటలు చేతి కొచ్చే టైంలో నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్​ పాలకులు  రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. కాగా కొత్తగూడెంలోని మీటింగ్​కు జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, నాయకులు కోనేరు సత్యనారాయణ, ఎడవల్లి కృష్ణ అటెండ్​ కాకపోవడం చర్చానీయాంశంగా మారింది.