రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఏడాదిన్నర పసి బాలుడి హత్య కేసులో నిందితుడు నాగరాజేనని పోలీసులు తేల్చారు. బాలుడి తల్లితో నాగరాజుకు ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 18న నిజామాబాద్ బస్టాండ్ లో తల్లి దగ్గర నుంచి బాబును నాగరాజు ఎత్తుకెళ్లాడు. అదే రోజు రాత్రి 11 గంటలకు అర్సపల్లికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి.. మత్తులో సిమెంటు దిమ్మతో బాలుడుని కొట్టాడు. దాంతో తలకు బలంగా గాయం కావడంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే రాత్రి బాలుడి మృతదేహాన్ని తీసుకొని నాగరాజు బాసరకు చేరుకున్నాడు. మరుసటి రోజు రైల్వే స్టేషన్ సమీపంలో బాలుడి మృతదేహాన్ని పొదల్లో పడేసి పరారయ్యాడు. అయితే నాగరాజు బాలుడి మృతదేహాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాగా.. ఈ నెల 25వ తేదీన బాలుడి తల్లిదండ్రులకు నాగరాజు జిల్లా కేంద్రంలో కనిపించడంతో చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు నాగరాజును తమదైన శైలిలో విచారించడంతో తానే హత్య చేసినట్లు నాగరాజు ఒప్పుకున్నాడు.
For More News..