త్వరలో హరీశ్ రావు ఫైల్స్​!

 త్వరలో హరీశ్ రావు ఫైల్స్​!
  • హరీశ్ ​ఇంట్లోఈడీ సోదాలు జరుగుతయ్​
  • బీజేపీ లీడర్​ నాయిని నరోత్తం రెడ్డి

సిద్దిపేట, వెలుగు : ‘ కొద్ది నెలల్లో మంత్రి హరీశ్ రావు బినామీలు ఎవరో.. వారిపై ఎన్నెన్ని ఆస్తులున్నాయో చెప్తా.. ఇవన్నీ హరీశ్ రావు ఫైల్స్ పేరుతో బయటపెడతా’ అని బీజేపీ నేత నాయిని నరోత్తంరెడ్డి అన్నారు. మంత్రి అవినీతి చిట్టాను వెలికితీస్తున్నానని, త్వరలో ఆయన లీలలతో పాటు బినామీ వ్యవహారాలన్నీ బటయకు తీసుకువస్తానన్నారు. సోమవారం సిద్దిపేట ప్రెస్​క్లబ్​లో విలేకరులతో మాట్లాడుతూ హరీశ్ రావు అవినీతి వివరాలను ఈడీకి అందజేశానని, త్వరలోనే ఆయన ఇంట్లో ఈడీ  సోదాలు జరుగుతాయన్నారు. సిద్దిపేటలో ఆయన బినామీల పేరిట  రూ.పదివేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తోందన్నారు. మంత్రి అరాచకాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికి  అర్థమయ్యేలా వివరిస్తానన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి మంత్రి రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు.

సిద్దిపేట అభివృద్ధి ప్రచార ఆర్భాటమేనని అన్నారు. హుజూరాబాద్ ఓటమిని హరీశ్ జీర్ణించుకోలేక అక్కడ ఇన్​చార్జిగా వ్యవహరించిన తనపై మూడు కేసులు పెట్టించాడని, అయినా భయపడేది లేదన్నారు. సిద్దిపేటలో హీరోలా కనిపించే విలన్ హరీశ్​ రావు అని అభివర్ణించారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టుతో సిద్దిపేట నియోజకవర్గంలో పెరిగిన సాగు వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులతో బీజేపీ కార్యకర్తలను, లీడర్లను భయపెట్టాలని చూస్తే అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. గుండ్ల జనార్దన్, లింగారెడ్డి, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.