
హైదరాబాద్, వెలుగు: సివిల్ వివాదం నేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ధర్మపంత్ హిందీ విద్యా సంస్థకు వేసిన తాళాలను తొలగించి, అది సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వ్యక్తులు విద్యాసంస్థను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరుతూ ధర్మపంత్ పాఠశాల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టి పాఠశాల నిర్వహణకు అవసరమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.