Balakrishna: నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అవార్డు

Balakrishna: నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అవార్డు

‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ (IFFD) 2026’ వేదికగా టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ (Balakrishna)కు అరుదైన గౌరవం లభించింది. దశాబ్దాలుగా సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం (Lifetime Achievement Award) ప్రదానం చేశారు.

2026 మార్చి 25 బుధవారం రాత్రి న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) ఈ అవార్డును బాలకృష్ణకు అందజేశారు. తెలుగు చిత్రసీమలో ఆయన అందించిన సేవలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విధానం, పరిశ్రమపై చూపిన ప్రభావాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ అవార్డు బాలకృష్ణ సినీ ప్రయాణానికి మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

ఈ వేడుకలో బాలకృష్ణతో పాటు ప్రముఖ బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్ (Sharmila Tagore), లెజెండరీ నటుడు ధర్మేంద్ర (Dharmendra) (ఆయన తరఫున కుటుంబ సభ్యులు) కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను అందుకున్నారు.

మార్చి 31 వరకు కొనసాగనున్న ఈ ఫెస్టివల్‌లో వివిధ భాషలకు చెందిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మతో హాజరయ్యారు.

ALSO READ : సాయిపల్లవి బాలీవుడ్ మూవీ ‘ఒకరోజు’ రిలీజ్

అలాగే నటీనటులు, దర్శకులు, నిర్మాతలు మరియు భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖ సభ్యులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. హేమ మాలిని, కంగనా రనౌత్, అర్జున్ కపూర్, నిమ్రత్ కౌర్, విక్కీ కౌశల్, సాన్యా మల్హోత్రా, సిద్ధాంత్ చతుర్వేది, లారెన్ గాట్లీబ్, అనుపమ్ ఖేర్, షర్మిలా ఠాగూర్, అరవింద్ స్వామి మరియు అజయ్ బిజ్లీ తదితర ప్రముఖులు రెడ్ కార్పెట్‌పై నడిచారు. ప్రస్తుతం ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలను బాలయ్య ఫ్యాన్స్ షేర్ చేస్తూ.. జై బాలయ్య అని స్లొగన్స్ ఇస్తున్నారు. 

ఇకపోతే, బాలకృష్ణ.. ఐదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో వెండితెరపై విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. ఆయన సినీ కెరీర్‌లో, 110 చిత్రాలలో, ఆయన తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అంతేకాకుండా హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారు.

ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 111వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. ఈ ఏడాది దసరా 2026కు మూవీ విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనంతరం  బాలకృష్ణ-వివేక్ ఆత్రేయతో కాంబోలో మూవీ రానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, 2027 వేసవిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.