- గంగాధర మండలం నారాయణపూర్, ఇస్తారుపల్లి గ్రామస్తుల వినతి
గంగాధర, వెలుగు: నారాయణపూర్ ప్రాజెక్టు నిర్మాణంతో తమ గ్రామాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ నారాయణపూర్, ఇస్తారుపల్లి వాసులు వేర్వేరుగా ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్, ఇస్తారుప్లలి గ్రామస్తులు సోమవారం నారాయణపూర్ నుంచి మధురానగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రాజెక్టు కట్ట నిర్మాణంలో భాగంగా గ్రామాన్ని సగానికి విడగొట్టి కొందరిని మాత్రమే పరిహారం పరిమితం చేయడం సరికాదన్నారు.
కొందరి ఇండ్లను మాత్రమే ముంపు పరిధిలోకి తెచ్చి, మిగిలిన వారిని వదిలేయడం వల్ల గ్రామంలో విభేదాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మిగిలిన ఇండ్లకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి నారాయణపూర్, ఇస్తారుపల్లి గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించాలని.. బాధితులకు పునరావాసం, నష్టపరిహారం కల్పించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
