
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోవడంతో కింగ్ విరాట్ కోహ్లీ అభిమానులతో పాటుగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నవీన్ ఉల్ హక్ ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. లక్నో, -ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీతో గొడవపడ్డ నవీన్ అప్పటినుంచి ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు.
ముంబై, -ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ ఔటయ్యాక.. ముంబై మ్యాచ్ ను చూస్తూ.. ఓ గిన్నెలో మామిడి పండ్లను షేర్ చేస్తూ.. స్వీట్ మ్యాంగోస్ అని నవీన్ ఉల్ హక్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అప్పటినుంచి మంచి టైమ్ కోసం ఎదురు చూస్తున్న కోహ్లీ అభిమానులకు ముంబైతో మ్యాచ్ బాగా కలిసివచ్చింది. లక్నోను ముంబై ఇండియన్స్ ఓడించడంతో కోహ్లీ అభిమానులు ట్విట్టర్ లో వరుసగా ట్రోల్ చేస్తూ నవీన్ ఉల్ హక్ పై చిన్నపాటి యుద్దానికే దిగారు.
ముంబై-, లక్నో మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఆటగాళ్లు కుమార్ కార్తీకేయ, విష్ణు వినోద్, సందీప్ వారియర్ లు కూడా ఓ టేబుల్ ముందు మామిడి పండ్లను పెట్టి ‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’ అన్న స్టైల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అటు నవీన్ ను జొమాటో, స్విగ్గీలు కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. నవీన్ బ్యాటింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసిన జొమాటో.. ‘నాట్ సో స్వీట్ మ్యాంగోస్’ అని పోస్ట్ పెట్టింది. ఇక స్విగ్గీ కూడా మామిడి పండ్లను కట్ చేసిన ఫోటోను షేర్ చేస్తూ ట్రోల్ చేసింది.
ఇక ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. మీడియం పేసర్ ఆకాశ్ మద్వాల్ (3.3-–0-–5–5) అద్భుత బౌలింగ్తో లక్నో సూపర్ జెయింట్స్కు ఊహించని షాకిచ్చాడు. ఫలితంగా బుధవారం జరిగిన నాకౌట్ మ్యాచ్లో ముంబై 81 రన్స్ భారీ తేడాతో లక్నోను చిత్తు చేసి క్వాలిఫయర్–2కు దూసుకెళ్లింది. టాస్ గెలిచిన ముంబై 20 ఓవర్లలో 182/8 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో 101 పరుగులకు ఆలౌటైంది.