
స్టార్ హీరోలకు ధీటుగా వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది నయనతార. అయితే గతేడాది ఆమె లీడ్ రోల్లో నటించిన 75వ సినిమా ‘అన్నపూర్ణి’ వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల ఓటీటీలో స్ట్రీమ్ అయిన ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. దీంతో నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించింది. ఈ క్రమంలో నయనతార కూడా స్పందించింది. సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరుతూ ఓ లెటర్ను పోస్ట్ చేసింది.
జై శ్రీరామ్ అంటూ తన లేఖను ప్రారంభించింది నయనతార. ‘‘అన్నపూర్ణి’ సినిమా వల్ల జరుగుతున్న పరిణామాలపై రియాక్ట్ అవడం కోసం బరువెక్కిన గుండెతో ఇది రాస్తున్నా. సంకల్పం ఉంటే ఎలాంటి కష్టాలను అయినా దాటవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని వదలకూడదు అనే స్ఫూర్తిని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం. అంతేతప్ప వేరే ఉద్దేశం లేదు. ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చే క్రమంలో తెలియకుండానే కొందరిని హర్ట్ చేసి ఉండవచ్చు. నేను కానీ, మా టీమ్ కానీ ఎవర్ని బాధపెట్టాలని అనుకోలేదు. ఒకరిని బాధ పెట్టే పని ఎప్పుడూ చేయను. అయినా ఎవరైనా హర్ట్ అయితే వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’ అని లెటర్లో వివరించింది నయనతార.