
- కారణాలపై అధికారులతో సమీక్ష
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పేలుడు సంభవించిన సిగాచి పరిశ్రమను నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. కమిటీ సభ్యులు సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి గల కారణాలపై నిశితంగా అధ్యయనం చేశారు.
ఘటన జరిగిన తీరు, ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులు ఎన్డీఎంఏ టీమ్ కు వివరించారు. ప్రమాదానికి గల కారణాలు అధ్యయనం చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్డీఎంఏ టీమ్ నివేదిక ఇవ్వనుంది. వారి వెంట కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, పరిశ్రమలు, అగ్నిమాపక, కార్మిక, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.