
- సాధ్యమైతే సీఎంల స్థాయిలో పరిష్కరించుకోవాలని సలహా
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తే సమస్యలు మరింత జఠిలమయి ఆలస్యం అవుతుందని సూచించింది.
రెండు రాష్ట్రాల మ ధ్య పెండింగ్ లో ఉన్న అంశాలపై సోమవారం కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ అధ్యక్షతన కీలక భేటీ జరిగింది. ఈ భేటీకి ఇరు రాష్ట్రాల సీఎస్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన భేటీలో.. కీలకంగా విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ లోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఇందులో ప్రధానంగా అప్పులు, ఆస్తులపై సవిరంగా చర్చించినట్టు సమాచారం. అయితే.. ఈ రెండు షెడ్యూల్ లకు సంబంధించిన 20 సంస్థల నిధుల పంపకంపై సానుకూలంగా ఉండాలని కేంద్రం సూచించింది. వీటిపై రెండు రాష్ట్రాలు సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సెక్రటరీ సూచించారు. అవసరమైతే అంశాల వారీగా సమస్యలను రెండు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పినట్టు తెలిసింది.
విదేశీ అప్పుల పంపకంపై చర్చ..
విదేశీ అప్పుల పంపకంపై రెండు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్రం పలు సూచనలు చేసింది. ఈ అప్పులపై న్యాయ సలహా తో ముందుకెళ్లాలని దిశా నిర్దేశం చేసింది. ఇందుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం చెబుతూనే.. అడ్వకేట్ జనరల్ (ఏజీ)లతో చర్చించి, అభిప్రాయం తీసుకుంటామని రాష్ట్ర అధికారులు బదులిచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఏజీల అభిప్రాయాల తర్వాత మరోసారి భేటీ అయి, నిర్ణయం తీసుకుందామని కేంద్ర సెక్రటరీ చెప్పారని సమాచారం. తాజా మీటింగ్ లోని అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. తదుపరి మీటింగ్ కు హాజరవుతామని అధికారులు తెలిపారు.