
- శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు ఉత్తమ్, సీతక్క, శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద బాధ్యతలు చేపట్టారు. బుధవారం బుద్ధ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు , ఎమ్మెల్యేలు పద్మావతి, ప్రేమ్ సాగర్ రావు, దానం నాగేందర్ హాజరై, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు రాష్ర్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు.
ఆరు గ్యారంటీల్లో ఎక్కువగా మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారని తెలిపారు.మహాలక్ష్మి స్కీమ్ లో రోజుకు 14లక్షల మంది ఫ్రీ జర్నీ చేస్తున్నారని, ఇప్పటిదాకా 55 కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ తొలి విడతలో భాగంగా 4 లక్షల 50 వేల ఇళ్లను సాంక్షన్ చేస్తున్నామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడదని, మహిళా కమిషన్ ద్వారా దాడులను అడ్డుకుంటామని పేర్కొన్నారు.
హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ గా సత్యనారాయణ బాధ్యతలు
రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ గా సత్యనారాయణ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. బుధవారం ముషీరాబాద్ లోని హస్తకళా భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని, గ్రీటింగ్స్ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ..హస్తకళల కార్పోరేషన్ క్షేత్ర స్థాయిలో కళా నైపుణ్యం ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. హస్తకళల మార్కెటింగ్కు ఈ సంస్థ వేదికని చెప్పారు. ప్రస్తుతం రూ.61 కోట్ల టర్నోవర్ ఉందని, దీనిని రూ. 600 కోట్లకు పెంచాలని మంత్రి సూచించారు.