- డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి .. అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రకటన
- డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి
- సిటీకి చెందిన సాజిద్ 27 ఏండ్లుగా ఆస్ట్రేలియాలోనే నివాసం
- యూరోపియన్ మహిళతో పెండ్లి.. ఇద్దరు పిల్లలు ఆస్ట్రేలియన్లే
- తండ్రి చనిపోయినా ఇక్కడికి రాలేదు.. 2022లో చివరి విజిట్
- సాజిద్ ఉగ్ర చర్యకు.. మన సిటీకి సంబంధం లేదని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనకు, హైదరాబాద్కు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. కాల్పులు జరిపిన దుండగులు సాజిద్ అక్రమ్(50) అతని కొడుకు నవీద్ అక్రమ్(24) హైదరాబాద్కు చెందిన వారే అయినప్పటికీ.. ఇక్కడున్న వారి కుటుంబసభ్యులతో, బంధువులతో పరిమితంగానే సంబంధాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ అడ్రస్తో కేవలం పాస్పోర్ట్ మాత్రమే ఉందన్నారు. సోషల్ మీడియా సహా ఇతర మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ మేరకు డీజీపీ మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సాజిద్ అక్రమ్ జరిపిన కాల్పుల్లో14 మంది చనిపోయారు. ఎదురుకాల్పుల్లో సాజిద్ కూడా హతమయ్యాడు. అయితే, అతడి మూలాలు హైదరాబాద్లో ఉండటంతో ఈ ఘటనకు మన సిటీకి లింక్ ఉందన్న ప్రచారం సాగిన నేపథ్యంలో డీజీపీ ఈ మేరకు వివరణ ఇచ్చారు.
27 ఏండ్ల క్రితమే ఆస్ట్రేలియాకు వలస..
మెహిదీపట్నం టోలీచౌకీకి చెందిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశాడు. సుమారు 27 ఏండ్ల క్రితం1998 నవంబర్లో ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. యూరోపియన్ మహిళ వెనెరా గ్రోసోను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. వీరికి కుమారుడు నవీద్ అక్రమ్, ఒక కుమార్తె ఉన్నారు. సాజిద్ వద్ద నేటికీ ఇండియన్ పాస్పోర్ట్ ఉంది. కొడుకు నవీద్, కుమార్తె ఆస్ట్రేలియాలో జన్మించడంతో వారిద్దరూ ఆస్ట్రేలియా పౌరులుగానే ఉన్నారు. గత 27 ఏండ్లుగా హైదరాబాద్లోని తన కుటుంబంతో సాజిద్కు పరిమిత సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇండియా విడిచి వెళ్లే ముందు అతనిపై ఎలాంటి కేసులు లేవని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆరుసార్లు వచ్చి వెళ్లాడు..
ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన తర్వాత సాజిద్ ఆరుసార్లు భారత్కు వచ్చి వెళ్లాడని డీజీపీ తెలిపారు. ఆస్తి సంబంధ విషయాలు సహా కుటుంబ సంబంధిత కారణాల వల్ల వచ్చాడన్నారు. తండ్రీకొడుకులిద్దరి ఉగ్ర కార్యకలాపాలపై హైదరాబాద్లోని కుటుంబ సభ్యులకు ఏమీ తెలియదన్నారు. వారు టెర్రరిస్టులుగా మారడానికి తెలంగాణలోని ఏ స్థానిక ప్రభావమూ లేదన్నారు. ‘‘అమెరికాకు వ్యతిరేకంగా సాజిద్ హమాస్ కార్యకలాపాలు నిర్వహించాడు. తన కుమారుడిని కూడా హమాస్ వైపు మళ్లించాడు. 2009లో తన తండ్రి చనిపోయినా.. సాజిద్ ఇండియాకు రాలేదు. తర్వాత పలుమార్లు వచ్చాడు. 2022లో చివరిసారిగా వచ్చాడు. టోలీచౌకీలో ఉన్న ఆస్తుల్లో తన వాటాను సోదరుడికి విక్రయించి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు” అని డీజీపీ వివరించారు.
