ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియాతో జరిగే లీగ్ మ్యాచ్ ను బాయ్కాట్ చేస్తున్నట్టు పాకిస్తాన్ ఆదివారం (ఫిబ్రవరి 1) అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 15న కొలంబోలో ఇండియాతో జరిగే మ్యాచ్లో తమ జట్టు బరిలోకి దిగబోదని తెలిపింది. పాక్ మ్యాచ్ను బహిష్కరిస్తే ఆ రెండు పాయింట్లు ఇండియాకు దక్కుతాయి.. అయితే గ్రూప్లోని మిగిలిన నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏ మూడు చిన్న జట్లే కావడంతో వాటిపై గెలిస్తే ఇండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేసినా పాక్ సూపర్–8 రౌండ్ చేరుకోనుంది.
ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇంటికే:
ఇండియాతో మ్యాచ్ బాయ్ కాట్ చేస్తే పాకిస్థాన్ ఓటమితో పాటు నెట్ రన్ రేట్ కూడా దారుణంగా పడిపోతుంది. నిబంధన 16.10.70 ప్రకారం ఏదైనా జట్టు మ్యాచ్ను వదులుకోవాలని నిర్ణయించుకుంటే, వారు 20 ఓవర్లలో 0 పరుగులు చేసినట్లే లెక్కించబడుతుంది. దీంతో ఆ జట్టు నెట్ రన్ రేట్ భారీగా దెబ్బ తింటుంది. దీంతో మిగిలిన మ్యాచ్ ల్లో పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినా వారి నెట్ రేట్ కారణంగా సూపర్-8 కు అర్హత సాధించడం కష్టమవుతుంది.
గ్రూప్ ఏ లో ఇండియాతో పాటు పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, USA లు ఉన్నాయి. ఇండియా, పాకిస్థాన్ జట్లు ఈజీగా సూపర్- 8 కు అర్హత సాధిస్తాయని చాలామంది భావిస్తున్నారు. ఇండియాతో పాక్ ఎలాగూ ఆడడం లేదు కాబట్టి ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ ఓడినా గ్రూప్ దశ నుంచే ఔట్ అవుతుంది. ఒకవేళ ఇండియా ఒక్క మ్యాచ్ లో ఓడినా పాకిస్థాన్ సూపర్-8 అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా తయారైంది.
పాకిస్తాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీస్తుంది. అంతేకాదు.. రాబోయే మిగతా మ్యాచ్ లపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాక్ వైఖరిపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఐసీసీ.. పాక్ జట్టును ఐసీసీ నిషేధించే అవకాశం ఉంది.దీనిపై ఇప్పటికే ఐసీసీ తీవ్రంగా చర్చిస్తుంది. నిర్ణయం మార్చుకోవాలని పాక్ జట్టుపై ఒత్తిడి చేస్తోంది. పాక్ తలొగ్గకపోతే ఆర్థికంగానే కాకుండా క్రికెట్ ప్రపంచం నుంచి నిషేధించే అవకాశాలు లేకపోలేదు.
