- 2 రోజులు నిర్బంధించి, ఫ్లాట్ సేల్ డీడ్ రద్దు చేశారని బాధితుడి ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ సిటీ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై సనత్నగర్ పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. ఓ ఫ్లాట్ వ్యవహారంలో నిర్బంధించి కొట్టారనే కేసులో ప్రధాన నిందితుడిగా రాధాకిషన్ రావు సహా మాసాని వెంకటరాజు, అల్లూరి వెంకట కాసి విశ్వనాథ రాజుపై అభియోగాలు మోపారు. ఈ మేరకు సెప్టెంబర్ 15న మొత్తం 29 పేజీలతో కూడిన చార్జ్షీట్ను కూకట్పల్లి కోర్టులో దాఖలు చేశారు. కూకట్పల్లి విజయ్నగర్ కాలనీకి చెందిన మునగపాటి సుదర్శన్ కుమార్ వ్యాపారం చేస్తుంటారు.
ఆయన స్నేహితులైన ఎస్ఆర్ నగర్కు చెందిన మాసాని వెంకటరాజు, సనత్నగర్కు చెందిన ఏవీకే విశ్వనాథరాజు తమకు చెందిన రాజేశ్వర కన్స్ట్రక్షన్స్లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. దీంతో రాజేశ్వర కన్స్ట్రక్షన్స్లో పెట్టుబడిగా సుదర్శన్ రూ.60 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఇందుకుగాను 2019లో సనత్నగర్ జెక్ కాలనీలోని విజయ అపార్ట్మెంట్లో ఫ్లాటు ఇచ్చారు.
టాస్క్ఫోర్స్ ఆఫీసులో 2 రోజుల నిర్బంధం
ఫ్లాట్ను సుదర్శన్ తన కుమార్తె పేరున రిజిస్టర్ చేయించి అందులోనే నివాసం ఉన్నాడు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగిన 2 నెలలకు విశ్వనాథ రాజు..
సుదర్శన్ను మరో రూ.5 లక్షలు రావాల్సి ఉందని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చేందుకు సుదర్శన్ నిరాకరించాడు.
ఇదే వ్యవహారంలో టాస్క్ఫోర్స్ పోలీసులు సుదర్శన్ ఇంటికొచ్చి ఓ విషయం మాట్లాడాలంటూ సికింద్రాబాద్లోని టాస్క్ఫోర్స్ ఆఫీసుకు తీసుకెళ్లారు. 2 రోజుల పాటు నిర్బంధించి బెల్టుతో కొట్టారు. దీంతో, భయపడిపోయిన సుదర్శన్ ఫ్లాటు సేల్ డీడ్ రద్దు చేసుకున్నాడు. ఫ్లాట్ సేల్ డీడ్ను బలవంతంగా రద్దు చేయించారంటూ సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
