
కిడ్నాప్ కు గురైన తొమ్మిది రోజుల పసికందును కేవలం రెండు గంటల్లోనే కేసును చేధించి తల్లి ఒడికి చేర్చారు కర్నూల్ జిల్లా పోలీసులు. కిడ్నాప్ పాల్పడిన నిందితురాలిని అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోనెగండ్ల మండలం చిన్ననేలటూర్ గ్రామానికి చెందిన మరియమ్మ 9 రోజుల క్రితం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. డిశ్చార్జి అయి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం శనివారం ఉదయం 7 గంటల సమయంలో మళ్లీ ఆస్పత్రికి వచ్చింది. అప్పటికి ఇంకా డాక్టర్లు రాకపోవడంతో బిడ్డతో ఆసుపత్రి ముందే ఎదురు చూస్తుండగా అదే సమయములో ఒక మహిళ వారిని పరిచయం చేసుకుంది. మాటల్లో పెట్టి మాయచేసి శిశువు ను తీసుకొని ఆటోలో పరారయ్యింది. కంగారు పడిన మరియమ్మ ఆస్పత్రి చుట్టుపక్కల ఆమె జాడ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబంతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో కేసు నమోదు చేసుకున్న కర్నూల్ పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేశారు. జిల్లా పోలీసు వాట్సాప్ గ్రూపులో ఫోటోలు చూసిన ప్యాపిలి ఎస్ఐ మారుతి శంకర్ ఓ మహిళ పాపతో కనిపించడాన్ని గమనించి.. అనుమానంతో ఆ పాప ఎవరి పాప అని అడుగగా ఆ మహిళ సరైన సమాదానం చెప్పలేదు. దీంతో ఎస్ఐ పాప ఫోటోను తీసి కర్నూల్ త్రీటౌన్ పోలీసులకు వాట్సాప్ లో పంపించాడు. వారు ఆ ఫోటోను తల్లి మరియమ్మకు చూపించగా తన బిడ్డగా గుర్తించింది. బిడ్డతో పాటు ఆ మహిళను ఆధీనంలోకి తీసుకొని కర్నూల్ ఎస్పీ కార్యాలయానికి చేర్చారు. అక్కడ జిల్లా ఎస్పీ పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ కు పాల్పడిన మహిళ ప్యాపిలి వసతి గృహములో వంటమనిషిగా పనిచేస్తున్న చంద్ర కళావతి గుర్తించారు పోలీసులు. ఆమెను అరెస్ట్ చేశారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. కేవలం రెండు గంటల్లోనే ఈ కిడ్నాప్ ను ఛేదించిన కర్నూల్ పోలీసులను ప్రజలు ప్రశంసిస్తున్నారు.