
హైదరాబాద్, వెలుగు: ప్యాసింజర్ల వినతుల మేరకు కర్నాటకలోని దావణగెరెకు ఆర్టీసీ కొత్త సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించింది. హైదరాబాద్ మియాపూర్ నుంచి రోజూ సాయంత్రం 6.40 గంటలకు ఈ బస్సు బయల్దేరుతుంది. శుక్రవారం ఈ బస్సును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త సర్వీస్ కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఎంజీబీఎస్, మహబూబ్ నగర్, రాయచూరు, సింధనూరు, గంగావతి, హోస్పేట్ మీదుగా వెళ్తుంది. దావణగెరె నుంచి రోజూ సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్కు తిరిగి బయలుదేరుతుంది. మియాపూర్ నుంచి దావణగెరెకు రూ.872, ఎంజీబీఎస్ నుంచి రూ. 840 చార్జీ వసూలు చేస్తారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ మధ్య కర్ణాటకలోని దావణగెరెకు తెలంగాణ నుంచి రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయని, డిమాండ్ దృష్ట్యా దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ సర్వీసును ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు, రాయచూరు తదితర ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నామని ఆయన చెప్పారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతుండడం మంచి పరిణామమన్నారు. దావణగెరెకు టికెట్ బుకింగ్ కోసం www.tsrtconline.in వెబ్సైట్ను సందర్శించాలని ఎండీ సూచించారు.
కంటి నిండా నిద్ర చాలా అవసరం
సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిఒక్కరికీ కంటి నిండా నిద్ర చాలా అవసరమని ఎండీ సజ్జనార్ అన్నారు. నిద్ర సరిగా పట్టకపోతే అలసటగా ఉంటుందని, ఏకాగ్రత కూడా లోపించి పనిమీద శ్రద్ధ తగ్గిపోతుందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ నిద్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం బస్భవన్లో ‘వరల్డ్ స్లీప్ డే థీమ్’ ను ప్రముఖ పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్ స్పెషలిష్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్తో కలిసి ఎండీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతి తర్వాత నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. నిద్రలేమి వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని వివరించారు. అనవసరమైన పనులతో సమయం వృధా చేసుకోకుండా రాత్రుళ్లు త్వరగా నిద్రపోవాలని సూచించారు.