విద్య, వైద్యంపై ఫోకస్ : కుమార్​దీపక్ 

విద్య, వైద్యంపై ఫోకస్ : కుమార్​దీపక్ 
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూలో మంచిర్యాల కొత్త కలెక్టర్ ​కుమార్​దీపక్ 
  •     ధరణి, పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తున్నాం 
  •     మున్సిపాలిటీలు, గ్రామాల్లో శానిటేషన్​మెరుగుపరుస్తం 
  •     అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు​
  •     సమస్యలుంటే వాట్సాప్​చేయండి 

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ప్రజలకు అత్యవసరమైన విద్య, వైద్య రంగాలపై ఎక్కువ ఫోకస్​ పెడతామని మంచిర్యాల కొత్త కలెక్టర్ ​కుమార్​ దీపక్​ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు. ధరణి పెండింగ్ ​ఫైళ్లను గడువులోగా క్లియర్​ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రెవెన్యూ, ఫారెస్ట్​అధికారుల కో ఆర్డినేషన్​తో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో శానిటేషన్​ మెరుగుపరుస్తామని, సీజనల్ ​వ్యాధులను కంట్రోల్​ చేస్తామని చెప్పారు. అధికారులు ప్రజల కోసం పనిచేయాలని, అవినీతికి పాల్పడితే యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్​ ఇచ్చారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదన్నారు. ‘వెలుగు’ ఇంటర్వ్యూలో కలెక్టర్​ పలు విషయాలపై మాట్లాడారు. 

సర్కారు స్కూళ్లలోనే నాణ్యమైన విద్య

సర్కారు స్కూళ్లలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ​అందించడానికి గవర్నమెంట్​ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ.17 కోట్లతో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సమకూర్చింది. స్కూళ్ల రీఓపెనింగ్​రోజునే స్టూడెంట్లకు టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్​ అందించాం. సర్కారు స్కూళ్లలో క్వాలీఫైడ్​ టీచర్లు ఉన్నారు. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ ​స్కూళ్లకు పంపుతున్నారు. నేను మందమర్రి మండలం సారంగపల్లి ప్రైమరీ స్కూల్​ను విజిట్ ​చేశాను. అక్కడ ఇద్దరు స్టూడెంట్లు, ఒక టీచర్​ మాత్రమే ఉన్నారు. పిల్లల సంఖ్య పెరిగితే అవసరమైన టీచర్లను నియమిస్తాం. సర్కారు స్కూళ్ల విషయంలో పేరెంట్స్​ఒపీనియన్​ మార్చుకోవాలి. పిల్లలను గవర్నమెంట్​ స్కూళ్లకే పంపాలి.

వైద్యసేవలు మెరుగుపరుస్తాం

జిల్లాలోని గవర్నమెంట్​హాస్పిటళ్లలో వైద్యసేవలు మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటాం. అవసరమైన డాక్టర్లు, స్టాఫ్​ను నియమిస్తాం. శానిటేషన్​పై దృష్టి పెడుతాం. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలి. పేషెంట్లకు మానవతా దృక్పథంతో ట్రీట్​మెంట్​ చేయాలి. ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్టు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. అన్ని హాస్పిటళ్లలో బయోమెట్రిక్ అడెండెన్స్​ సిస్టమ్​ అమలు చేస్తాం. ప్రజాప్రతినిధుల సహకారంతో మెడికల్​కాలేజీ, జనరల్​ హాస్పిటల్, ఎంసీహెచ్ లో​వర్క్స్​త్వరగా కంప్లీట్​చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.

ధరణి, పోడు సమస్యలకు పరిష్కారం

ధరణి పెండింగ్​ఫైళ్లను గడువులోగా క్లియర్​ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. వివాదాలు, కోర్టు కేసులు ఉన్నవి మినహా మిగతా వాటిని వారం పది రోజుల్లో పరిష్కరిస్తాం. జిల్లాలో పోడు భూముల సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల కో ఆర్డినేషన్​తో పరిష్కరించాలని ఆదేశాలిచ్చాం. పోడు రైతులు హక్కు పత్రాల మేరకు సాగు చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్​లేదు. అంతకుమించి ఆక్రమించుకుంటే సమస్యలు వస్తాయి. అందుకే పోడు భూములను జియో ట్యాగింగ్​ చేస్తాం. పోడు రైతులపై దాడులు చేయొద్దని, ట్రాక్టర్లు సీజ్ ​చేయవద్దని ఫారెస్ట్​ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చాం. 

సీజనల్​ వ్యాధులపై అలర్ట్

వానాకాలంలో సీజనల్​వ్యాధులు, అంటురోగాలు వచ్చే చాన్స్ ఎక్కువ. వీటిని కంట్రోల్ ​చేయడానికి మున్సిపాలిటీలు, గ్రామాల్లో శానిటేషన్​ మెరుగుపర్చుతాం. క్లోరినేషన్ ​వాటర్ సప్లయ్​ చేయడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్​ చేపడుతాం. అంటువ్యాధులను అరికట్టడానికి ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. విషజ్వరాలు, టైఫాయిడ్, డెంగీపై అలర్ట్​గా ఉన్నాం. మెడికల్​ అండ్​హెల్త్​ డిపార్ట్​మెంట్​ యాక్షన్​ ప్లాన్​తో రెడీగా ఉంది. గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో సీజనల్ ​వ్యాధులకు సంబంధించిన మందులు కొరత లేకుండా చూస్తాం.  

ఇల్లీగల్​ వెంచర్లపై యాక్షన్

జిల్లావ్యాప్తంగా ఇల్లీగల్​ రియల్​ఎస్టేట్​ వెంచర్లు వెలుస్తున్నాయి. నాలా, డీటీసీపీ లే అవుట్​ లేకుండానే ప్లాటింగ్​ చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. కొంతమంది వ్యవసాయ భూముల్లో వెంచర్లు చేసి ఫామ్​ల్యాండ్స్​ పేరిట అమ్ముతున్నారు. ఇలాంటి వాటిపై సర్కారు సీనియస్​గా ఉంది. లే అవుట్ పర్మిషన్​ లేకుండా సబ్​ రిజిస్ట్రార్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్​ చేస్తే యాక్షన్​ తీసుకుంటాం. జిల్లాలో గవర్నమెంట్​ భూములు, చెరువుల కబ్జాలను అరికడుతాం. అక్రమ నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.  

వరదలొస్తే ఎదుర్కొంటాం..

వానాకాలంలో మంచిర్యాల టౌన్​లోని పలు కానీలకు వరద ముప్పు ఉంది. అయినప్పటికీ ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. వివిధ శాఖల సమన్వయం, ఫ్లడ్​ రెస్క్యూ టీమ్​సహాయంతో వరదల నుంచి ప్రజలను కాపాడుతాం. కలెక్టరేట్​లో ప్రతి సోమవారం గ్రీవెన్స్​ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. మున్సిపాలిటీలు, ఎంపీడీవో ఆఫీసుల్లో ప్రజాపాలన కౌంటర్లలో దరఖాస్తులు అందించవచ్చు. అత్యవసరమైతే 9492120800 నంబర్​కు వాట్సాప్​ చేస్తే స్పందిస్తా. సాయంత్రం​ 4 నుంచి 5 గంటల మధ్య కలెక్టరేట్​లో విజిటర్స్​కు అందుబాటులో ఉంటా. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజల కోసం నిజాయతీగా పనిచేయాలి. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు.