- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
- ఏప్రిల్30న శివధర్ రెడ్డి పదవీ విరమణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ బాస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (1991 బ్యాచ్) నియమితులయ్యారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎస్ కే.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ బి.శివధర్రెడ్డి ఏప్రిల్30న పదవీవిరమణ పొందనున్నారు. ఈ క్రమంలోనే మే 1న సీవీ ఆనంద్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారుల్లో సీవీ ఆనంద్ అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి.ఇటీవలే యూపీఎస్సీ డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపిన విషయం తెలిసిందే. అందులో సీవీ ఆనంద్తోపాటు 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యామిశ్రా పేర్లు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురిలో సీవీ ఆనంద్ అత్యంత సీనియర్ కావడంతో డీజీపీ హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్(-హెచ్ఓపీఎఫ్)గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి డీజీపీలు నియమితులైన అందరూ తొలుత ఇంచార్జి డీజీపీగాలు బాధ్యతలు నిర్వహించగా.. సీవీఆనంద్ మాత్రం పూర్తిస్థాయి డీజీపీగా నియమితులు కావడం గమనార్హం. డీజీపీగా 2028 జూన్ వరకు సీవీ ఆనంద్ కొనసాగనున్నారు.
- సైబరాబాద్ కమిషనర్గా
2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా తన ప్రత్యేకత చాటుకున్నారు. ఏడీజీగా పదోన్నతి పొందిన తర్వాత, ఆయన పౌర సరఫరాల కమిషనర్గా, ఆహార కార్యదర్శిగా, మరియు పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీగా రెండేళ్లలోపే కార్పొరేషన్ అప్పును రూ.15,500 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు తగ్గించారు. డిసెంబర్ 2021లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.
శాంతిభద్రతల నిర్వహణతోపాటు యాంటీ నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ బ్యూరోల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 2024లో 8 నెలల పాటు ఏసీబీ, విజిలెన్స్ డీజీగా పనిచేశారు. ఈ సమయంలో 110కి పైగా కేసులు నమోదు చేసి, 192 మంది ప్రభుత్వ అధికారులను అరెస్టు చేశారు. 2024లో గణేశ్ ఉత్సవాల సమయంలో ఆయన రెండోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బదిలీ అయ్యారు. సెప్టెంబర్ 2025 నుంచి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. బదిలీపై రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు.
- పక్కా హైదరాబాదీగా ముద్ర
సీవీ ఆనంద్ తల్లిదండ్రులు చామ దామోదర్ రెడ్డి, యశోదా దేవి. రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్ మండలం, కుంట్లూరు గ్రామానికి చెందినవారు. 1959లో హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. సీవీ ఆనంద్ 1968 జూన్ 5న హైదరాబాద్ పాత నగరంలోని పేట్లబుర్జ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించారు. సీవీ ఆనంద్ విద్యాభ్యాసం విద్యారణ్య ఉన్నత పాఠశాల, బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, నిజాం కాలేజీలో బీఏ, ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఎకనామిక్స్లో ఎంఏ పూర్తి చేశారు. తన 22వ ఏట మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను క్లియర్ చేశాడు. శిక్షణ తర్వాత 1991లో సొంత రాష్ట్రాన్ని కేటాయించారు. 1993లో తన నిజాం కళాశాల సహవిద్యార్థిని లలితా ఆనంద్ను వివాహం చేసుకున్నారు. ఆయనకు మిలింద్, నిఖిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
- ఉత్తమ సేవలకు జాతీయ స్థాయిలో పలు పతకాలు
ఐపీఎస్ అధికారిగా ఉత్తమ సేవలకుగాను సీవీ ఆనంద్ పలు సందర్భాల్లో జాతీయ స్థాయిలో పతకాలు దక్కించుకున్నారు. 2002లో రాష్ట్రపతి శౌర్యపతకం, 2004లో అంతరిక్ష్ సురక్షా పతకం, 2007లో భారత పోలీస్ పతకం, 2014లో భారత ఎన్నికల సంఘం జాతీయ పురస్కారం, 2017లో రాష్ట్ర పోలీస్ పతకం, 2022 అతి ఉత్కృష్ట సేవా పతకం లాంటివి ఎన్నో సాధించారు.
- ఐపీఎస్గా ప్రత్యేక ముద్ర
1991 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్..తాను ఐపీఎస్ అధికారిగా ఏ బాధ్యతలు తీసుకున్నా ప్రత్యేకత చాటుకున్నారు. ఐపీఎస్గా శిక్షణ తర్వాత వరంగల్ రూరల్ సబ్-డివిజన్లో ఏఎస్పీగా నియమితులయ్యారు. వరంగల్, బెల్లంపల్లి, నిజామాబాద్లో ఎస్పీగా ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీగా, హైదరాబాద్ నగర తూర్పు జోన్, సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేశారు.
లారీలు, క్రేన్లకు కోడింగ్లు ఇవ్వడం ద్వారా హుస్సేన్ సాగర్లో జరిగే మొత్తం గణేశ్ నిమజ్జనాన్ని క్రమబద్ధీకరించారు. హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద లేక్ పోలీస్ ఏర్పాటు చేస్తూ సీవీ ఆనంద్ తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. ఐజీగా పదోన్నతి పొందిన సీవీ ఆనంద్ హైదరాబాద్ నగర ట్రాఫిక్ కమిషనర్గా మూడేళ్లలో పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

