అవినీతి సమస్యలు, రాజకీయ విభేదాలు, పరిపాలనా వైఫల్యాలు, నాణ్యమైన విద్య లేకపోవడం, ఇటీవలి పరిణామాలు, నిరుద్యోగం, నిరంతర పేదరికం వంటివి ప్రజాస్వామ్యానికి సవాళ్లుగా మారాయి. ప్రజాస్వామ్యం రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చలేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల పెట్టుబడిదారీ వ్యవస్థను అది సృష్టించింది.
ఈ శతాబ్దం, సంప్రదాయ నమ్మకాలైన న్యాయాన్ని లేదా రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయాన్ని ప్రయత్నిస్తూ ప్రస్తుత సామాజిక నిర్మాణాన్ని మార్చబోతోంది. భారతదేశం నిస్సందేహంగా ఒక కొత్త రాజకీయ వ్యవస్థ వైపు పయనిస్తోంది. సమానత్వం కాకపోయినా, మెరుగుదల వైపు సాగే ఈ పరివర్తనను చరిత్రే నిర్ధారిస్తోంది.
చరిత్రలో అనేక సామాజిక నిర్మాణాలు చోటుచేసుకున్నాయి. వాటిలో ప్రతి ఒక్కటీ వర్తమానాన్ని ప్రభావితం చేసింది. పరిపాలనను తీసుకురావడానికి గ్రామాలను విస్తరించి వాటిని భూభాగాలుగా మార్చడానికి రాష్ట్రాలు ఉద్భవించాయి. గ్రామాలు, ప్రాంతాలు, భూభాగాలు రాష్ట్ర రూపాన్ని సంతరించుకున్నాయి. పన్ను వసూలు ఆర్థిక వనరుగా ఉండగా గ్రామ, ప్రాంతీయ అధిపతులు వ్యవస్థాపనకు ఆధారంగా ఉండేవారు.
రాష్ట్ర ప్రధాన కార్యాలయం పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రక్రియలో ఐక్యతను, బలాన్ని తీసుకురావడానికి, ఉత్పత్తిని కొనసాగించడానికి కులాల రూపంలో ఉద్భవిస్తున్న సామాజిక అసమానతలను హేతుబద్ధీకరించడానికి దేవాలయాల రూపకల్పన జరిగింది. వివిధ వృత్తి సమూహాలు కులాలుగా రూపాంతరం చెందాయి.
కుటుంబ వ్యవస్థ ద్వారా కొత్త విలువ వ్యవస్థలు, ఆస్తి హక్కులు సామాజిక హోదాల ఆధారంగా నిర్మితమయ్యాయి. . దేవుళ్లను హేతుబద్ధీకరించడానికి విశ్వాసాలు అవసరమయ్యాయి. దేవుడి పేరుతో బోధించడానికి పూజారులు, బ్రాహ్మణులు అనే మేధావులుగా పిలుచుకునే ఒక కొత్త మేధావి వర్గం పుట్టింది.
ఆర్థిక వ్యవస్థ
క్రీ.పూ. 5వ శతాబ్దం నాటికి మానవ సమాజం అసమానతలతో విభజనకు గురైంది. అసమానతలను కొనసాగించడానికి దేవుడు అవసరమయ్యాడు. ఈ బోధనలకు వ్యతిరేకంగా జైనమతం, బౌద్ధమతం ఆవిర్భవించాయి. సమాజంలో బ్రాహ్మణీకరణకు వ్యతిరేకంగా అవి బలమైన భావజాలాన్ని నిర్మించాయి.
ఇక్కడ ప్రజల సంస్కృతి, అస్తిత్వ వాస్తవాలు బ్రాహ్మణీకరించి హిందూమతంగా ప్రాచుర్యం పొందాయి. కాగా, అత్యంత ముఖ్యమైనది రైతులు అనే ఒక వర్గం సాగుదారులుగా ఆవిర్భవించడం. ఈ కాలంలో భారతదేశం భూస్వామ్య వ్యవస్థ కంటే ఒక రైతు సమాజంగా ఉండేదని కొంతమంది చరిత్రకారులు వాదించారు. క్రీ.శ. 8వ శతాబ్దం నాటికి రైతులు శూద్రులుగా, అనగా శ్రేణిలో నాలుగో వర్గంగా
గుర్తించారు. వారి హోదాను సాధారణ కూలీల కంటే ఉన్నతంగా చూపారు.
వ్యవసాయ సంస్కృతి
వేద సాహిత్యం నుంచి దేవుళ్లను సృష్టించడానికి పాలకులు వివిధ ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించారు. విభిన్న హోదా సమూహాలతో కూడిన మొత్తం సమాజం సామాజిక వ్యవస్థలో, రాజ్య వ్యవస్థలో ఏకీకృతమైంది. కాకతీయులు తమను తాము నాలుగో కులంగా అంటే శూద్రులుగా పరిచయం చేసుకుని, విస్తారమైన అటవీ ప్రాంతాలను వ్యవసాయంలోకి తీసుకువచ్చారు, చెరువులు, దేవాలయాలను నిర్మించారు. అప్పటివరకు తెలంగాణ కుగ్రామాలతో కూడిన గిరిజన ప్రాంతంగా ఉండేది. ఉమ్మడి భాష తెలుగు. వ్యవసాయ సంస్కృతి ద్వారా ఆ కుగ్రామాలు గ్రామాలుగా అభివృద్ధి చెందాయి.
కాకతీయులు ఏకకాలంలో దేవాలయాలు, చెరువులను నిర్మించారు. బ్రాహ్మణులకు పూజారులుగా, మేధావులుగా మారే అవకాశం లభించడంతో.. వారిలో చాలామంది ఈ సమయంలో తెలంగాణకు వలసవచ్చారు. స్థానిక భాషలతో గ్రామీణ ఏకత్వాన్ని తీసుకురావడంలో శూద్రులు సమైక్య పాత్ర పోషించారు. ఈ పరిణామాలతోపాటు శూద్రులు వివిధ వృత్తులను చేపట్టే కులాలుగా రూపాంతరం చెందారు.
ఆధునిక మేధోవాదం
మధ్యయుగ కాలం నాటికి దేశం ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. అది ఐరోపా వాణిజ్య సంస్థలను ఆకర్షించింది. ఆ విధంగా అది వాణిజ్య సంస్థల చేతుల్లోకి వెళ్లి, చివరికి వలస పాలనలోకి వచ్చింది. అన్ని భౌగోళిక భూభాగాలు భారతదేశంగా మారాయి.
వలస పాలన.. జిల్లా పరిపాలన, గవర్నర్లు, గవర్నర్- జనరల్, మండలాలు, శాసనసభలు, న్యాయవ్యవస్థతో కూడిన వివిధ పాలనా సంస్థలను ప్రవేశపెట్టింది. ఈ పరివర్తన మేధావులుగా పిలిచే ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులను సృష్టించింది. వారు భారతీయుల కోసం జాతీయవాద భావజాలాన్ని నిర్మించారు.
ఆంగ్ల వార్తాపత్రికలు, ఆ తర్వాత ప్రాంతీయ భాషా పత్రికలు భౌగోళిక భారతదేశాన్ని దేశ భావనతో అనుసంధానించాయి. భారతదేశ గతం, సామాజిక నిర్మాణాలు, మత సంస్థలను అధ్యయనం చేసిన మేధోవాదం, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రైతాంగ జాతీయవాదం, మత జాతీయవాదం, భాషా జాతీయవాదం రూపంలో భారత జాతీయవాదాన్ని సృష్టించింది. ఈ ప్రవాహం నుంచే ఆధునిక రాజకీయాలు పుట్టాయి.
ధావులు, మధ్యతరగతి వర్గాలు ఈ నూతన భారతదేశానికి గొంతుకలుగా మారాయి. వారు చేతివృత్తులవారు, హరిజనులు, ముస్లింలు, రైతులు, కార్మికులతో కలిసి దేశాన్ని సమగ్ర జాతీయ ఉద్యమం వైపు నడిపించారు. తత్ఫలితంగా భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. వివిధ వర్గాల ప్రజలను గుర్తించేలా రాజ్యాంగాన్ని రూపొందించడం, వయోజన ఓటు హక్కుతో కూడిన ఎన్నికల ప్రజాస్వామ్యం కోసం మేధావులు గొప్పగా కృషి చేశారు.
ప్రజాస్వామ్యంగా పెట్టుబడిదారీ విధానం
భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలలోకి ప్రవేశించి చివరికి అది మార్కెట్ వ్యవస్థను, అంటే పెట్టుబడిదారీ విధానాన్ని అనుకరించింది. దేశ నాయకత్వం రాజ్యాంగ లక్ష్యాలను పక్కనపెట్టి, పేదరికం, నిరుద్యోగాన్ని అంతం చేయడానికి పెట్టుబడిదారీ మార్గాన్ని పరిష్కారంగా ఎంచుకుంది. అపారమైన సంపద సృష్టించినా పేదరికం మాత్రం అంతం కాలేదు. 1970వ దశకంలో అసంతృప్త రాజకీయ నాయకులు పెరుగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు.
అయితే అప్పటికే ఉన్న రాజకీయ అధికారానికి ప్రత్యామ్నాయంగా వారు కూడా విఫలమయ్యారు. అప్పటినుంచి ప్రజాస్వామ్యం కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారాన్ని ఒకే నాయకుడి చేతిలో కేంద్రీకరించడానికి దారితీసింది. ఒకరి నుంచి ఒకరు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కులాలు రాజకీయ సాధనాలుగా మారాయి. పార్టీలు కుల పునాదులపై నిర్మితమయ్యాయి. శాసనసభ్యులు, అధికారులు కేంద్రీకృత అధికారానికి అధీనంలోకి వచ్చారు.
హిందూమతం గురించి మాట్లాడిన పార్టీ దానిని రాజకీయాల్లోకి మార్చడం కొనసాగించింది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు హిందూమతం వాస్తవంగా ఒక రాజకీయ ఆయుధంగా మారింది. ఇది పైన పేర్కొన్న ప్రజల సంస్కృతిని హిందూమతంగా వక్రీకరించింది. స్వాతంత్ర్య ప్రక్రియలో ఉద్భవించిన ఆలోచనా స్రవంతులన్నీ అంతమయ్యాయి.
అస్తిత్వ సంక్షోభంలో యువత
ప్రస్తుత విద్యా వ్యవస్థ సామాజిక వ్యవస్థల సరళిని అర్థం చేసుకోలేదు. అయినప్పటికీ పెట్టుబడిదారుల సేవలో భాగంగా ఉద్యోగాధారిత కోర్సులు అని ప్రవేశపెట్టారు, కానీ అవి యువతను ఉపాధికి అనుగుణంగా మార్చడంలో విఫలమయ్యాయి. మతం గురించి మాట్లాడిన రాజకీయ పాలన సమాజాన్నిగానీ, కుటుంబాన్నిగానీ సంస్కరించలేదు. ఈ పరిస్థితికి యువత బాధితులుగా మారారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ మానవ సంక్షోభాన్ని అర్థం చేసుకోలేదు.
నాయకుల లక్ష్యం ఎన్నికలలో గెలవడమే. తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాల్సిన యువత అస్తిత్వ సంక్షోభంలో ఉన్నారు. ప్రసిద్ధమైన భారతీయ విలువల వ్యవస్థ కనుమరుగైంది. ఏ రాజకీయ పార్టీ కూడా పరిష్కారాన్ని అందించలేకపోయింది. కుల ఉద్యమాలు తమ కులాలను కాపాడుకోవడంలో సంకుచితంగా మారాయి.
యువతలో పేర్కొన్న నిరాశలు జంతర్ మంతర్లో జరిగినట్లుగా ఆందోళనలకు దారితీశాయి. కానీ ఇంకా రాజకీయాలకు దారితీయలేదు. వారి ఆందోళన నిరంకుశ రాజకీయాలు, ప్రభుత్వం, చట్టం, పోలీసులకు వ్యతిరేకంగా చెలరేగిన ఒక విస్ఫోటనం. ఈ సంక్షోభంలో మొత్తానికి యువత ఒక పరిష్కారంతో ముందుకు వస్తుందా? యువత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి సంస్కరిస్తే అది ఒక కొత్త రకమైన ప్రజాస్వామ్యానికి నాంది అవుతుంది.
- ప్రొ. ఇనుకొండ తిరుమలి
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
