కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు

కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు

లక్ష ఎకరాలకు తాగునీరు అందించే  బ్రాహ్మణవెళ్ళెంల ప్రాజెక్ట్ 75 శాతం పూర్తయినా… మిగిలిన పనులు పూర్తి చేసేందుకు 200కోట్లు మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెళ్ళెంల ప్రాజెక్ట్ ను పరిశీలించిన ఆయన….పాత ప్రాజెక్ట్ పనులు చేస్తే కమీషన్ రాదనే కొత్త ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కమీషన్ ల కోసమే… రైతుల కోసం కాదన్నారు. నీళ్ళు లిఫ్ట్ చేస్తే వచ్చిన రూ. 200 కోట్ల కరెంటు బిల్లు డబ్బులు వృథా అయ్యాయన్నారు. అవి ఇచ్చినా ఇక్కడ ప్రాజెక్ట్ పూర్తయ్యేదన్నారు. ఏప్రిల్ లోపు ప్రాజెక్ట్ పూర్తి చేయకుంటే రైతులను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దక్షిణ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఉత్తర తెలంగాణకే సీఎం కేసీఆర్ నిధులు ఇస్తున్నారన్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ తో ప్లాట్లు కొన్న పేద ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. దీనిపై రేపే హైకోర్టులో పిల్ వేస్తానన్నారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, ఇబ్రహీంపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వెంచర్లు చేసిన టీఆరెస్ నాయకులే బాగుపడ్డారన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సీఎం కేసీఆర్ తుగ్లక్ చర్యలు చేపడుతూ వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారన్నారు. వ్యవస్థలో అవినీతి పరులను తీసివేయాలే తప్ప వ్యవస్థను రద్దు చేయవద్దన్నారు. అవినీతి మొదలైంది కేసీఆర్ కుటుంబం తోనేన్న కోమటి రెడ్డి…50వేల కోట్ల ఆస్తి సంపాదించి బినామీ పేర్లతో ఉన్న కేసీఆర్ పార్టీని… ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.