శ్రీవాణి దర్శన టికెట్ల జారీ మరింత సులభం.. కొత్త కౌంటర్లను ప్రారంభించిన టీటీడీ

శ్రీవాణి దర్శన టికెట్ల జారీ మరింత సులభం.. కొత్త కౌంటర్లను ప్రారంభించిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. శ్రీవాణి దర్శన టికెట్లను ఇకనుంచి మరింత సులభంగా జారీ చేయనున్నారు.  అందుకోసం తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా శ్రీవాణి దర్శన టికెట్ల కొత్త  కేంద్రాన్ని మంగళవారం (జులై 22) టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, టీటీడీ ఈవో జె.శ్యామలరావుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడుతున్నారని, ఈ క్రమంలో భక్తులకు సులభతరంగా టికెట్లు జారీ చేసేందుకు కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో రూ.60 లక్షల వ్యయంతో ఈ నూతన కౌంటర్లను నిర్మించినట్లు తెలిపారు.

బుధవారం (జులై 23) నుంచే ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ ప్రారంభం అవుతుందని, భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఆ తర్వాత హెచ్వీసీ, ఏఎన్సీ ప్రాంతాల్లో భక్తుల సౌలభ్యం కోసం ఆధునీకరించిన సబ్ ఎంక్వైరీ కార్యాలయాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, జంగా కృష్ణమూర్తి, భాను ప్రకాష్ రెడ్డి, శాంతా రామ్, నరేష్, సదాశివరావు, నర్సిరెడ్డి, జానకి దేవి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.