ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తుంటే..ఒకరకమైన భయం, ఆందోళన కలుగుతోంది. చిన్న చిన్న కారణాలకే హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు ఎక్కువైపోతున్నారు. అన్ని రకాలుగా ఆనందంగా ఉన్నోళ్లు కూడా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అంతు చిక్కడం లేదు. హైదరాబాద్ కూకట్ పల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది. కూకట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ( మే 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
కూకట్ పెళ్లికి చెందిన ఎంజాల కార్తీక్, జ్ఞానిక ( మంజుల )కు రెండు నెలల క్రితం వివాహం అయ్యింది. ఎనిమిదేళ్లుగా కార్తీక్ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవదంపతులు.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టి హ్యాపీగా ఉన్నారు. ఏం జరిగిందో ఏమో కానీ...నవదంపతులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కార్తీక్ ఉరేసుకొగా... జ్ఞానిక పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
తెల్లవారినా తలుపు తీయకపోవడం గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్ళి చూడగా.. ఇద్దరు విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
