శోభనం రోజే గుండెపోటుతో కొత్త జంట మృతి..  ఒకే టైంలో ఇద్దరికీ హార్ట్ ఎటాక్

శోభనం రోజే గుండెపోటుతో కొత్త జంట మృతి..  ఒకే టైంలో ఇద్దరికీ హార్ట్ ఎటాక్

లక్నో: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన యువజంట తొలిరాత్రే కన్నుమూసింది. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకేసారి హార్ట్​ ఎటాక్ రావడంతో తెల్లారేసరికి విగతజీవులుగా మారారు. పెళ్లయిన రెండు రోజుల్లోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్​లో బహ్రయిచ్ లోని గోధియా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రతాప్  యాదవ్(24), పుష్ప (22) కు గత నెల 30న వివాహం జరిగింది. బారాత్ జరిగిన తర్వాతి రోజు పెండ్లికొడుకు ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు. కొత్త జంట రాత్రి రూంలోకి వెళ్లింది. మర్నాడు ఉదయం ఎంత సేపయినా బయటకు రాలేదు. బంధువులు తలుపులు బద్దలుకొట్టి చూడగా బెడ్​పైన ప్రతాప్, పుష్ప విగత జీవులుగా కనిపించారు.

వెంటనే బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. భార్యభర్తలు ఇద్దరూ ఒకే సమయంలో గుండెపోటుతో చనిపోయినట్లు పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు. అయితే, కొత్త జంటలో ఎవరికీ గుండె సంబంధింత వ్యాధులు ఉన్న చరిత్ర లేదని, ఒక్కరోజే ఇద్దరికీ గుండెపోటు రావడం మిస్టరీగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. వారి మృతిపై మరింత ఎంక్వయిరీ చేసేందుకు వారి శరీరంలో నుంచి నమూనాలు సేకరించి లక్నోలోని ఫోరెన్సిక్  సైన్స్  ల్యాబరేటరీకి పంపామని వెల్లడించారు.

గాలి ఆడకపోవడం వల్లే గుండెపోటు?

కొత్త జంట గడిపిన రూంలో వెంటిలేషన్  లేదు. దీంతో గాలి ఆడక ప్రతాప్, పుష్ప కార్డియాక్  అరెస్టుకు గురై చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కొత్త జంట పెండ్లి వేడుకలో రెండు రోజులపాటు తీరిక లేకుండా గడిపారని, దీంతో వారు తీవ్రంగా అలసిపోయి ఉంటారని చెప్పారు. అదే సమయంలో వారికి శోభనం ఏర్పాటు చేశారని చెప్పారు. ‘‘రూంలోకి బయటి వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లేమీ కనిపించలేదు. వారిపై దాడి జరిగినట్లు కూడా పోస్టుమార్టం రిపోర్టులో తేలలేదు. దీంతో వారి మరణం మిస్టరీగా మారింది. పెండ్లి వేడుకలో జరిగిన ప్రతి సంఘటనపైనా ఎంక్వయిరీ చేస్తున్నం. వారు ఏం తిన్నారో కూడా దర్యాప్తు చేస్తున్నం. ఫోరెన్సిక్  నిపుణులు కూడా వారు గడిపిన గదిని పరిశీలించారు. మరింత ఎంక్వయిరీ చేస్తే తప్ప వివరాలు తెలియవు” అని పోలీసులు చెప్పారు.