
- రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో గత నెల 13న ఘటన
- పోలీసులు బెల్టుతో కొట్టడంతోనే మృతి చెందాడని బంధువుల ఆరోపణ
- మీడియా కథనాలను సుమోటోగా తీసుకున్న మానవ హక్కుల కమిషన్
- రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్ మహ్మద్ ఇర్ఫాన్ (35) మృతిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా తీసుకుంది. పోలీసులు టార్చర్ పెట్టడం వల్లే మృతి చెందాడనే మీడియా కథనాల ఆధారంగా కేసు నమోదు చేసింది. 2 వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర డీజీపీ జితేందర్కు గురువారం నోటీసులు జారీ చేసింది.
కర్నాటకలోని మైసూరుకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య నిషాద్ బేగం, ముగ్గురు పిల్లలతో కలిసి రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్పూర్ దర్గా కలిచ్ ఖాన్లో ఇర్ఫాన్ నివాసం ఉంటున్నాడు. కుటుంబ కలహాలతో భార్య ఫిర్యాదు చేయగా.. గత నెల 13న ఇర్ఫాన్ను రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్కు తీసువచ్చారు.
వాంతులు చేసుకుని కుప్పకూలిన ఇర్ఫాన్
భార్యా భర్తలిద్దరికీ పోలీసులు మొదట కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన సమయంలో ఇర్ఫాన్ వాంతులు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ వద్దే కుప్పకూలాడు. దీంతో వెంటనే అతడిని హస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కాగా, ఇర్ఫాన్ మృతికి పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కౌన్సిలింగ్అనంతరం ఓ గదిలోకి తీసుకెళ్లి రబ్బరు బెల్టులతో తీవ్రంగా కొట్టారని, గంట తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకుని కుప్పకూలి చనిపోయాడని గత నెల 14న మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. మీడియా కథనాల ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆటో డ్రైవర్ డెత్ విషయంలో మీడియా కథనాలు నిజమని తేలితే.. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని కమిషన్ నోటీసుల్లో స్పష్టం చేసింది.