యాక్సిడెంట్ లో తండ్రి మరణం.. అమితంగా ప్రేమించే నాన్న చనిపోవడంతో పుట్టెడు దుఖం.. తండ్రి కష్టం వృధా కాకూడదని ఓ విద్యార్థి ఏడ్చుకుంటూ పరీక్షలకు హాజరైన ఘటన అందరిని కలచివేసింది. తండ్రి మృతిచెందిన విషయం తెలిసిన కొడుకు దుఃఖాన్ని దిగమింగుతూ టెన్త్ పరీక్షకు హాజరైన ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరిలకపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరిలకపల్లి గ్రామ శివారులో శనివారం(మార్చి14) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు 45 అక్కడిక్కడే మృతి చెందాడు. శనివారం తండ్రి అంత్యక్రియలు జరగాల్సి ఉండగా మృతుని కొడుకు తీరని దుఃఖంలో ఏడ్చుకుంటూ కుమ్మరి ధనుష్( 16) టెన్త్ పరీక్షకు హాజరయ్యాడు.
తూప్రాన్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు ధనుష్ హాజరు కావడంతో అందరిని కలచివేసింది. తన తండ్రి ఎంతో కష్టపడి తమని చదివిస్తున్నాడని అందుకు తన తండ్రి కష్టం వృధా కాకూడదని ఏడ్చుకుంటూ పరీక్షలకు ధనుష్ హాజరైనట్లు స్థానికులు చెబుతున్నారు.
