
న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయవాది శ్రావణ్ కుమార్ ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుతో ఇరు రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. స్టూడెంట్ల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని నిరుడు డిసెంబర్లో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. కానీ ఆత్మహత్యల కట్టడికి తీసుకున్న చర్యలు తెలుపలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని, లేదంటే సీఎస్ లు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొంది. తెలంగాణలో 2019 జాతీయ క్రైం రికార్డుల ప్రకారం 426 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒకే వారంలో 22 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ప్రభుత్వ క్రైం రికార్డుల ఆధారంగా 383 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది.