ఏసీబీ వలలో .. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్

ఏసీబీ వలలో .. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్
  • నిర్వాసిత రైతు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

జహీరాబాద్, వెలుగు: నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. నిర్వాసిత రైతు నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని న్యాల్కల్ మండలం హుస్సేల్లి గ్రామానికి చెందిన భూనిర్వాసితుడికి రూ.52.87లక్షల నష్ట పరిహారం ఇచ్చేందుకు నిమ్జ్ అధికారులు రూ.65 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను అశ్రయించాడు. 

గురువారం ఏసీబీ మెదక్ రీజియన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో జహీరాబాద్ లోని నిమ్జ్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్జ్ స్పెషల్​డిప్యూటీ కలెక్టర్ రాజు రూ.50 వేలు, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్ రూ.15వేలు తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అలాగే, బాధిత రైతు కుటుంబ సభ్యులకు కూడా రావాల్సిన నష్టపరిహారం కోసం జహీరాబాద్ ఆర్డీఓ డ్రైవర్ దుర్గయ్య మధ్యవర్తిత్వం వహించి నష్ట పరిహారం ఇప్పించేందుకు లక్ష డిమాండ్ చేసినట్టు తెలిసింది. అందులో డిప్యూటీ కలెక్టర్ కు రూ.75వేలు, కార్యాలయ సిబ్బందికి రూ.25వేలు ఇవ్వాల్సి ఉంటుందని రైతుకు చెప్పాడని సమాచారం. దీనికి సంబంధించిన కాల్ రికార్డ్ ను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్, డ్రైవర్ దుర్గయ్యను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.