గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వారం రోజులపాటు రాత్రిపూట చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో 9 మంది ట్రాన్స్జెండర్లను అరెస్టు చేసినట్టు ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన తెలిపారు. రెండు పీఐటీఏ కేసుల్లో ముగ్గురు బాధితులను రక్షించి, 5 మంది నిందితులను పట్టుకున్నామన్నారు. అలాగే సైబరాబాద్ షీ టీమ్స్ కమిషనరేట్ పరిధిలో 142 డెకాయ్ ఆపరేషన్లు చేపట్టి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యచర్యలకు పాల్పడిన 76 మందిని రెడ్హ్యాండెడ్పట్టుకున్నారు. వీరిలో 51 మంది కేసులు నమోదు చేయగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కుటుంబ కౌన్సెలింగ్, సీడీ ఈడబ్ల్యూ కేంద్రాల్లో భార్యాభర్తల కుటుంబ వివాదాల్లో ఉన్న 29 కుటుంబాలను తిరిగి కలిపే ప్రయత్నాలు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. సైబరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో మానవ, పిల్లల అక్రమ రవాణా, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, బాల్య వివాహాలు, పిల్లల హక్కులు, బాల కార్మికులు, యాచించడం, సైబర్ బెదిరింపులు, సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, హెల్ప్లైన్లు (181, 1098, 100, 1930) ప్రాముఖ్యతలను వివరించామన్నారు.
