పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్కాంలో కీలక నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ (49)కి చెక్ పెట్టేందుకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. గతవారం లండన్లో అరెస్టై రిమాండ్లో ఉన్న నీరవ్ మోడీని ఇండియాకు తిరిగి తీసుకొచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఈ నెల 29న కీలక విచారణ జరగనుండటంతో అక్కడి అధికారులకు సహకరిచేందుకు సీబీఐ ఈడీ ప్రత్యేక బృందం లండన్ బయలు దేరి వెళ్లనుంది. జాయింట్ డైరెక్టర్స్థాయి అధికారి నేతృత్వంలోని టీం లండన్ వెళ్తోంది.
13 వేల కోట్ల రూపాయల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ లండన్లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు శుక్రవారం (మార్చి-29) హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రెండవసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు అక్కడి అధికార వర్గాలు ధృవీకరించాయి. గత వారం మోడీని అరెస్ట్ చేసిన స్కాట్లాండ్ యార్డ్ అధికారులు కోర్టు ముందు హాజరుపర్చగా.. అతని బెయిల్ పిటీషన్ను తిరస్కరించింది. దీంతో నీరవ్ ను జైలుకు తరలించారు.
