క్రిప్టోలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
న్యూయార్క్ : క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమస్యలపై తక్షణం శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అన్నారు. వీటి వల్ల హాని కలగకుండా జీ20 దేశాలు జాగ్రత్తపడాలని, ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోవాలని ఆమె అన్నారు. న్యూయార్క్లో శుక్రవారం ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంలో జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లతో "క్రిప్టో ఆస్తులతో స్థూల ఆర్థికపరమైన చిక్కులు" అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రస్తుతం భారతదేశం జీ20 దేశాలకు ఆతిథ్యం ఇస్తున్నది. క్రిప్టోకు సంబంధించిన సమస్యలు జీ20 దేశాల మధ్య ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.
ఈ రంగాన్ని నియంత్రించాల్సిన అవసరం గురించి సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఈ అంశంపై జరిగిన మేధోమథన సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్టులు హాజరయ్యారు. పాలసీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లోని కీలక అంశాలను బయటకు తీసుకురావడానికి ఐఎంఎఫ్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) చేస్తున్న ప్రయత్నాలను జీ20 దేశాలు గుర్తిస్తున్నాయని నిర్మల అన్నారు. క్రిప్టో ఆస్తులకు సంబంధించిన అన్ని విషయాలతో ఒక ‘సింథసిస్ పేపర్’ను తేవాలని అభిప్రాయపడ్డారు.