జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఢిల్లీలోని రాజాజీ మార్గ్లో ఉన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లిన నీతీష్ కుమార్.. అక్కడే రాహుల్ గాంధీతోనూ భేటీ అయ్యారు. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ ముగ్గురు నేతలు చర్చించారని తెలుస్తోంది. పాట్నాలో విపక్ష నేతలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, జేడీయూ చీఫ్ లలన్ సింగ్ కూడా పాల్గొన్నారు. గత 45 రోజుల్లో రాహుల్ గాంధీతో నీతీశ్ కుమార్ సమావేశం కావడంతో ఇది రెండోసారి.
మే 21న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తోనూ నీతీశ్ కుమార్ చర్చలు జరిపారు. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధమైన కేజ్రీవాల్కు తన సంఘీభావాన్ని ప్రకటించారు. మరోవైపు ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నీతీశ్ కుమార్, తేజస్వి యాదవ్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లాతోపాటు పలు విపక్ష నేతలు హాజరైన విషయం తెలిసిందే. దీని ద్వారా తాము ఐక్యంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం విపక్ష పార్టీలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కేంద్రంలో ఎన్డీయే సర్కార్కు వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాలన్నీ త్వరలో సమావేశం కాబోతున్నాయి. అయితే, ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనున్నట్టు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
https://twitter.com/INCIndia/status/1660607247594971138