బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోను.. శపథం చేసిన నితీష్

 బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోను.. శపథం చేసిన నితీష్

తాను బతికున్నంత వరకు బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శపథం చేశారు. సమస్తిపూర్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నితీష్ ఈ విషయాన్ని ప్రకటించారు.  తన ప్రసంగంలో బీజేపీ పై నితీష్  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడున్న బీజేపీ మునుపటిలా లేదన్నారు. గతంలో బీజేపీలో ఉన్నవాళ్లు పనిచేసేవారని.. కానీ ఇప్పుడున్న వారు  పని కంటే ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. 

అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలతో తనకున్న సత్సంబంధాలను నితీష్ కుమార్ గుర్తుచేసుకున్నారు. వారికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ నాయకత్వం ఎవ్వరికీ గౌరవం కూడా ఇవ్వకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.  బీజేపీలో ఉన్నప్పుడు తాను మౌనంగా ఉండేవాడినని నితీశ్‌ కుమార్‌ తెలిపారు. కాగా రెండు నెలల క్రితం ఎన్డీఏ నుంచి వైదొలిగిన నితీష్ కుమార్ ... ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.