రియాజ్‎పై కాల్పులు జరపలే.. బతికే ఉన్నడు: ఎన్‌కౌంటర్‌పై నిజామాబాద్ సీపీ క్లారిటీ

రియాజ్‎పై కాల్పులు జరపలే.. బతికే ఉన్నడు: ఎన్‌కౌంటర్‌పై నిజామాబాద్ సీపీ క్లారిటీ

హైదరాబాద్: నిజామాబాద్‎లో పట్టపగలే నడిరోడ్డుపై కానిస్టేబుల్‎ను హత్య చేసిన రౌడీ షీటర్ రియాజ్‎ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిందితుడు రియాజ్ పోలీసులకు చిక్కి తప్పించుకునే క్రమంలో నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రియాజ్ ఎన్ కౌంటర్‎పై నిజామాబాద్ సిటీ కమిషనర్ (సీపీ) సాయిచైతన్య కీలక ప్రకటన చేశారు.

నిందితుడి రియాజ్‎పై పోలీసులు ఎలాంటి కాల్పులు జరపలేదని.. రియాజ్ ప్రాణాలతో ఉన్నాడని చెప్పారు. నిందితుడు రియాజ్‎ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తాము అదుపులోకి తీసుకోవడానికి ముందే రియాజ్ ఒక వ్యక్తితో గొడవ పడ్డాడని.. ఆ గొడవలో రియాజ్‌కు గాయాలు అయ్యాయిని వెల్లడించారు. ప్రస్తుతం రియాజ్‌కు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 

నిజామాబాద్‌‌‌‌ నగరంలో సీసీఎస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ ప్రమోద్‌‌‌‌ను హత్య చేయడంతో పాటు అతడి మేనల్లుడు ఆకాశ్‌‌‌‌, ఎస్సై విఠల్‌‌‌‌ను రియాజ్‌‌ గాయపరిచిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న రౌడీ షీటర్ రియాజ్‎ను పట్టుకునేందుకు వెళ్లగా.. పోలీసులపై దాడి చేశాడు నిందితుడు. రియాజ్ దాడిలో గాయపడిన సీసీఎస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ ప్రమోద్‌ చనిపోయాడు. ఏకంగా కానిస్టేబుల్‎ను నిందితుడు హత్య చేయడంతో ఈ ఘటనను పోలీసు శాఖ సీరియస్‎గా తీసుకున్నది. 

ఈ మేరకు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య నిందితుడు రియాజ్‌‎ను పట్టుకునేందుకు ఎనిమిది స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌లను రంగంలోకి దింపారు. రియాజ్‌‌‌‌ నగరం నుంచి బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడే నాకాబందీ నిర్వహిస్తూ, పట్టణాన్ని జల్లెడ పట్టారు. పోలీసులు ఎట్టకేలకు రియాజ్‎ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌‌‌‌ ప్రమోద్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీకి పోస్టుమార్టం అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.