సైలెంట్ రేషన్ కార్డులపై విచారణ .. కేంద్రం నుంచి అందిన లిస్ట్​.. కొన్ని కార్డులు రద్దయ్యే చాన్స్​

సైలెంట్ రేషన్ కార్డులపై విచారణ .. కేంద్రం నుంచి అందిన లిస్ట్​.. కొన్ని కార్డులు రద్దయ్యే చాన్స్​
  • 7,518 కార్డులను పరిశీలిస్తున్న సివిల్​సప్లయ్ అధికారులు
  • 80 శాతానికి పైగా ఎంక్వైరీ పూర్తి
  • కొన్ని కార్డులు రద్దయ్యే చాన్స్​

కామారెడ్డి, నిజామాబాద్​, వెలుగు : రెగ్యులర్​గా రేషన్ తీసుకోకుండా ఉన్న కార్డులు,  ఆధార్​ వివరాలు సరిగా లేని కార్డుల లిస్ట్​ను కేంద్ర ప్రభుత్వం సివిల్​ సప్లయ్​ అధికారులకు ఇటీవల పంపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7,518 రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి ఎంక్వైరీ చేసి రిపోర్ట్  ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. లబ్ధిదారులు ఉన్నారా ? లేరా.. ఆధార్​ కార్డుల్లో తప్పులెందుకున్నాయి.. అన్న అంశాలను పరిశీలించాలని కేంద్రం పేర్కొన్నది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 80 శాతానికి పైగా కార్డులను అధికారులు పరిశీలించి ఆన్​లైన్​లో నమోదు చేశారు.  

కేంద్రం పంపిన లిస్టుల్లోని కార్డుల సంఖ్య 

కేంద్రం నుంచి సివిల్​ సప్లయ్ అధికారులకు వచ్చిన లిస్ట్​లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 7,518 రేషన్​ కార్డులు ఉన్నాయి.  ఇందులో కామారెడ్డి జిల్లాలో 1,620, నిజామాబాద్ జిల్లాలో 5.898 కార్డులు ఉన్నాయి. 
 
పరిశీలనతో తేలిన  అంశాలు.. 

6 నుంచి 12 నెలల కాలంగా  కొందరు రేషన్ తీసుకొవట్లేదు.  యజమాని పేరుతో మరో  స్టేట్​లో కూడా రేషన్​ కార్డు ఉండటం,  కొందరు కార్డు యజమానులు చనిపోవడం, డూప్లికేట్​ ఆధార్​ కార్డుల ద్వారా కార్డులు  పొందటం, 18 ఏండ్లు నిండని వ్యక్తుల పేరిట కార్డు జారీ కావటం,  ఆధార్​ కార్డు ఒకరి పేరిట ఉండగా, రేషన్​ కార్డు మరొకరి పేరిట ఉండటం  వంటి కారణాల వల్ల కార్డులపై విచారణ చేయాలని కేంద్రం సూచించింది. బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి కార్డులు తీసుకున్నవారు, ఇతర రాష్ట్రాల వారు తిరిగి తమ రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో కూడా ఆ కార్డుల మీద రేషన్​ తీసుకోవడం లేదు.  ఇప్పటికే 80 శాతానికి పైగా కార్డుల పరిశీలన కంప్లీట్​ అయ్యింది.  కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1,497 కార్డుల పరిశీలన పూర్తి కాగా, ఇంకా 123 కార్డులను పరిశీలించాల్సి ఉంది.  నిజామాబాద్​ జిల్లాలో కార్డుల పరిశీలన పూర్తి కావచ్చింది.  సంబంధిత కార్డుల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేసి  ఉన్నతాధికారులకు జిల్లా సివిల్ సప్లయ్​ అధికారులు పంపిస్తున్నారు.  విచారణ అనంతరం ఇందులో చాలా వరకు రేషన్​ కార్డులు అనర్హత కారణాలతో రద్దయ్యే అవకాశముంది.     

ప్రస్తుత రేషన్ కార్డుల సంఖ్య..

నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం  4,02,217 తెల్ల రేషన్ కార్డులు ఉండగా, ఇందులో  13,10,012 మంది లబ్ధిదారులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం  2,56,732 కార్డులు ఉంటే ఇందులో  9,35,007 మంది లబ్ధిదారులు
 ఉన్నారు.  

కేంద్రం ఆదేశాలతో పరిశీలన..

కేంద్రం పంపించిన రేషన్​ కార్డుల లిస్ట్​ను పరిశీలన చేయాలని తహసీల్దార్లకు పంపాం.  వారు ఎంక్వైరీ చేసిన సమాచారాన్ని ఆన్​లైన్​లో ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో పరిశీలన చివరి దశకు వచ్చింది.  

మల్లికార్జునబాబు, డీఎస్​వో, కామారెడ్డి