రౌడీ షీటర్​ దారుణ హత్య..బోధన్​ కోర్టుకు వెళ్లి వస్తుండగా నరికి చంపిన ప్రత్యర్థులు

రౌడీ షీటర్​ దారుణ హత్య..బోధన్​ కోర్టుకు వెళ్లి వస్తుండగా నరికి చంపిన ప్రత్యర్థులు
  • రౌడీ షీటర్​ వెంట ఉన్న వ్యక్తికి  కాలు ఫ్రాక్చర్​

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన రౌడీ షీటర్​సయ్యద్​ఆరీఫ్​అలియాస్​ డాన్(32)​ను గురువారం దారుణంగా చంపారు. బోధన్​ కోర్టులో ఓ కేసు వాయిదాకు వెళ్లి వస్తుండగా ఎడపల్లి మెయిన్​ రోడ్డుపై పక్కా ప్లాన్​తో మాటు వేసిన ప్రత్యర్థులు కత్తులతో నరికి చంపారు. ఆరీఫ్​ వెంట ఉన్న అతడి ఫ్రెండ్​బుల్లెట్​ ఖాదర్​కాలుకు ఫ్రాక్చరయ్యింది. ఓ దొంగతనం కేసులో  రౌడీ షీటర్​ ఆరీఫ్​తో పాటు ఆరుగురిపై బోధన్​ కోర్టులో కేసు నడుస్తోంది. ఇందులో నలుగురు రెండు బుల్లెట్ బండ్లపై నిజామాబాద్​నుంచి బోధన్​ వెళ్లి నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఎడపల్లి బ్రిడ్జి వద్దకు బండి నడుపుకుంటూ ఆరీఫ్​ చేరుకోగానే అక్కడ రెడీగా ఉన్న లారీతో ప్రత్యర్థులు బుల్లెట్​బండిని ఢీకొట్టారు. కింద పడగానే లారీ వెనుక కారు దిగిన నలుగురు వ్యక్తులు తల్వార్లతో ఆరీఫ్​ను పొడిచి చంపారు. వెంట ఉన్న ఫ్రెండ్ ​ఖాదర్​ జోలికి వెళ్లలేదు. అయితే లారీ ఢీ కొట్టినప్పుడు అతడి కాలు విరిగింది. ఆరీఫ్​ వెంట మరో బుల్లెట్​పై ఉన్న ఇద్దరు దాడిని చూసి భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఆరీఫ్​ ను చంపిన ప్రత్యర్థులు కారులో పారిపోయారు. సమాచారం తెలుసుకున్న బోధన్​ ఏసీపీ కిరణ్​కుమార్, సీఐ శ్రీనివాస్​ రాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆరీఫ్​ డెడ్​బాడీని జిల్లా హాస్పిటల్ కు తరలించి, ఖాదర్​ను బోధన్​హాస్పిటల్​లో చేర్పించారు. 

బెయిల్​పై ఈమధ్యే బయటకు..

రౌడీ షీటర్​ ఆరీఫ్​​పై రెండు హత్య కేసులు, రెండు హత్యాయత్నం కేసులు, ఓ దొంగతనం కేసు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1న నగర శివారులోని నెహ్రూనగర్​ వద్ద జరిగిన ఇబ్రహీం అనే రౌడీ షీటర్​ హత్య కేసులో ఆరీఫ్​ నిందితుడిగా ఉన్నాడు. ఈమధ్యనే బెయిల్​పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రత్యర్థులు పక్కా స్కెచ్​తో ఆరీఫ్​ను హతమార్చినట్టు తెలుస్తోంది.  నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.