నిమ్స్ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ బీరప్ప

నిమ్స్ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ బీరప్ప

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS)కు కొత్త డైరెక్టర్‌‌ గా డాక్టర్ బీరప్పను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పోటీలో చాలా మంది వైద్యులు ఉన్నప్పటికీ.. డాక్టర్‌ బీరప్ప వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది.  డాక్టర్‌ బీరప్ప ప్రస్తుతం ఇన్ ఛార్జ్ డైరెక్టర్‌గా కొనసాగుతుండగా.. పూర్తిస్థాయి డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.   

ఇక ప్రస్తుత డైరెక్టర్‌ మనోహర్‌ అనారోగ్యం కారణంగా ఆ హోదాలో కొనసాగలేనని చెప్పడంతో కొత్త డైరెక్టర్‌ నియామకం అనివార్యంగా మారింది.  మనోహర్‌ నిమ్స్ డైరెక్టర్‌ గా  2015 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించి ఇటీవలే పదవి విరమణ చేశారు. నిమ్స్‌కు తొలిసారిగా 1985లో అప్పటి ప్రభుత్వం డైరెక్టర్‌ను నియమించింది. 

తొలి డైరెక్టర్‌గా ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు (1985–1990) నియమితులు కాగా.. ఆ తర్వాత 1997–2004 మధ్య కూడా రెండుసార్లు ఆయనే డైరెక్టర్‌గా కొనసాగారు. ఆ తర్వాత డా.ప్రసాదరావు (2004–2010) ఐదేళ్లకు పైబడి డైరెక్టర్‌గా ఉన్నారు.  తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి  నిమ్స్‌లో వైద్యం కోసం జనాలు వస్తుంటారు.