కేవలం జీతమే..బెనిఫిట్స్​ లేవ్!

కేవలం జీతమే..బెనిఫిట్స్​ లేవ్!
  • రిటైర్మెంట్​ ఏజ్​ పెరిగినా సింగరేణిలో దక్కని ప్రయోజనాలు
  • 60 ఏళ్ల వరకే పీఎఫ్​అమలు 
  • ముందస్తుగా స్పందించని సింగరేణి
  • ఆర్థికంగా నష్టపోనున్న ఎంప్లాయీస్

మందమర్రి, వెలుగు:సింగరేణి ఉద్యోగులు, ఆఫీసర్లకు సీఎంపీఎఫ్​ బెనిఫిట్స్​60 ఏళ్ల వరకు మాత్రమే వర్తించనున్నాయి. గతేడాది రాష్ట్ర సర్కార్​ సంస్థలో పనిచేసే కార్మికుల రిటైర్మెంట్ ఏజ్​60 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీన్ని  మార్చి 2021 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఏజ్​పెంపుదలతో రిటైర్​అయిన 1,082 మందికి ఏడాది పాటు మళ్లీ డ్యూటీ చేసే చాన్స్​దక్కింది. దీంతోపాటు సంస్థలో పనిచేస్తున్న 43,899 మంది ఉద్యోగులకు సర్వీసు వర్తించనుంది. రిటైర్మెంట్​ఏజ్​60 నుంచి 61ఏళ్లకు పెంచడంతో ఏడాదికి సంబంధించిన బొగ్గు గనుల భవిష్య నిధి పథకం (సీఎంపీఎఫ్​), ఫ్యామిలీ పెన్షన్​  ప్రయోజనాలు అందుతాయని ఉద్యోగులు భావించారు. 60 ఏళ్ల లెక్క ప్రకారమే బొగ్గు గని కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు వర్తిస్తాయని తాజాగా సీఎంపీఎఫ్​కమిషనర్​  ఉత్తర్వులు జారీ చేయడంతో  61ఏళ్ల పాటు డ్యూటీ చేసిన సింగరేణియులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సర్కారు​ఆదేశాలతో రిటైర్మెంట్​ఏజ్​పెంచిన సింగరేణి యాజమాన్యం సీఎంపీఎఫ్​ బెనిఫిట్స్ విషయంలో ముందస్తుగా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖతో చర్చించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. 
కార్మికులకు ఎట్ల చెల్లిస్తరు?

సీఎంపీఎఫ్​ చట్టం ప్రకారం 12 శాతం పీఎఫ్​ కింద, కుటుంబ పింఛను పథకం కోసం 7శాతం చొప్పున మొత్తం 19 శాతం ఉద్యోగుల వేతనాల నుంచి కోత విధిస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం తన వాటా కింద పీఎఫ్​అకౌంట్​లో జమ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా సర్వీసు చివరి ఏడాది ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పెరుగుతాయి. సీఎంపీఎఫ్​ నిల్వ డబ్బులు ఎక్కువగా ఉండటంతో వాటిపై వడ్డీ, పింఛను సైతం ఏడాది కాలానికి అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ పెంచిన ఏడాది కాలానికి కార్మికులకు కేవలం జీతం తప్ప ఎలాంటి అదనపు ఆర్థిక ప్రయోజనాలు వర్తించవన్న  విషయం సీఎంపీఎఫ్​నిర్ణయంతో తేలిపోయింది. దీని వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోనున్నారు. 2022 మార్చి తర్వాత రిటైర్​అయిన ఉద్యోగులకు పీఎఫ్​, పెన్షన్​ స్కీం కింద కోత విధించిన మొత్తాలను ఏ విధంగా చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. యాజమాన్యం వాటా కలిపి సింగరేణి సంస్థనే ఈ కోత విధించిన మొత్తాలను చెల్లిస్తుందా.. లేదా కేవలం ఉద్యోగుల వాటానే తిరిగి ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. రానున్న కాలంలో 61 ఏళ్ల తర్వాత రిటైర్​అయ్యే ఉద్యోగులకు ఇదే పరిస్థితి ఎదురుకానుంది. 


కార్మికులు నష్టపోకుండా చూడాలి:
రిటైర్మెంట్​ఏజ్​61ఏళ్లకు పెంచడంతో మళ్లీ డ్యూటీలో చేరిన కార్మికులు ఏడాది కాలానికి సంబంధించి సీఎంపీఎఫ్​ బెనిఫిట్స్​నష్టపోకుండా రాష్ట్ర సర్కార్, సింగరేణి సంస్థ చర్యలు తీసుకోవాలి. ఏజ్​పెంచడంతో సింగరేణిలో అన్ని రిజిస్టర్డ్​స్టాండింగ్​ఆర్డర్స్​మార్చాలని ఇప్పటికే  అన్ని జాతీయ, సింగరేణి కార్మిక సంఘాలు రీజినల్​లేబర్ కమిషనర్​వద్ద సంతకాలు పెట్టాయి. రాష్ట్ర సర్కార్, సింగరేణి యాజమాన్యం కార్మికులకు న్యాయం చేయాలి.
- యాదగిరి సత్తయ్య, బీఎంఎస్​స్టేట్ ప్రెసిడెంట్