కాడ కషాయంతో ఎలాంటి ముప్పు లేదు

కాడ కషాయంతో ఎలాంటి ముప్పు లేదు

క్లారిటీ ఇచ్చిన ఆయుష్ శాఖ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కాడ కషాయాన్ని తాగాలని కేంద్ర ఆయుష్ శాఖ సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కషాయంతో కాలేయానికి ప్రమాదమని పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పందించింది. కాడ కషాయంతో కాలేయానికి ముప్పు వాటిల్లుతుందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇది తప్పుడు భావన అని కొట్టేపారేసింది. ఈ కషాయాన్ని తయారు చేయడానికి వాడే దినుసులను అందరూ తమ ఇళ్లల్లో వంట చేయడానికి వినియోగిస్తారని తెలిపింది.

కాడ కషాయాన్ని చేయడానికి ఉపయోగించే నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, తులసి మొదలైనవి మనుషుల శ్వాస వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయని ఆయుష్ మినిస్ట్రీ సెక్రటరీ విద్యా రాజేశ్ కొటెచా చెప్పారు. ‘కాడ కషాయం కాలేయాన్ని దెబ్బ తీస్తుందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది పూర్తిగా తప్పుడు భావన’ అని కొటెచా పేర్కొన్నారు. ఆయుర్వేద లిటరేచర్, క్లినికల్ ఎక్స్‌‌పీరియన్స్‌‌, నిర్ధారిత ఆధారాలు, జీవసంబంధిత ఆమోదయోగ్యతను దృష్టిలో పెట్టుకొనే కాడ కషాయాన్ని వాడాలంటూ ప్రోటోకాల్‌‌లో నిర్దేశించామని క్లారిటీ ఇచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటూ పలు గైడ్‌‌లైన్స్‌‌ను మార్చి నెలలో ఆయుష్ మినిస్ట్రీ విడుదల చేసింది. వాటిలో హెర్బల్ టీ లేదా కాడ కషాయాన్నితాగడం కూడా ఉంది.