హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 87.79% విద్యార్థులు హాజరయ్యారని టీజీఆర్డీసీ సెట్ కన్వీనర్, తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు.
2024–-25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో కోర్సుల ప్రవేశ పరీక్ష కోసం 18,989 దరఖాస్తులు రాగా పరీక్ష కు 16,564 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్ష 64 కేంద్రాల్లో, బీసీ గురుకుల జూనియర్ కాలేజీలో సీట్ల ప్రవేశ పరీక్ష 208 కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించామన్నారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీలో సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 88.02% విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీలో సీట్ల కోసం 47,463 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 41,775 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన చెప్పారు.