
- ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అడుగులు
- కేబినెట్ మీటింగ్లో నిర్ణయం!
- దాదాపు 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా
హైదరాబాద్, వెలుగు : సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింపజేయకూడదని కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రజాప్రతినిధులకు రుణమాఫీ అవసరం లేదనే అభిప్రాయాన్ని మంత్రులందరూ వ్యక్తం చేసినట్టు సమాచారం. వీరితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలపై కేబినెట్ మీటింగ్లో సుదీర్ఘంగా చర్చించారు. రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టాలి? దీనికి ఎన్ని నిధులు అవసరం? నిధుల సమీకరణ ఎలా?
అనే దానిపై మంత్రలందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గత ప్రభుత్వం ఏ రకంగా రుణమాఫీ చేసింది? అప్పుడున్న విధివిధానాలు ఏమిటనే వాటిని చదివి వినిపించారు. ఆ తర్వాత ముందుగా అనుకున్న దాని ప్రకారం రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టాలనే దానిపై తయారు చేసిన డ్రాఫ్ట్నోట్ను చదివారు. ఇందులో పీఎం కిసాన్కు సంబంధించిన నిబంధనలను స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పీఎం కిసాన్లో ఉన్న రెండు
మూడు నిబంధనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ఇన్ కమ్ ట్యాక్స్కట్టే వాళ్లకు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై కూడా కేబినెట్లో చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే అదంతా పెద్ద ప్రాసెస్కావడం, అందులోనూ చాలా తక్కువ మందే ఉంటారనే అభిప్రాయం వ్యక్తం కావడంతో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కుటుంబానికి 2 లక్షల మాఫీ?
కుటుంబంలో రూ.లక్ష చొప్పున రుణాలు ఉంటే, ఆ కుటుంబంలో రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయాలనే సూచన కూడా మంత్రులు చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా, ఒక్కరికే రూ.లక్ష వరకు మాఫీ చేశారు. ఇక బంగారం తనఖా పెట్టి అగ్రికల్చర్లోన్లు తీసుకున్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. నిధుల సమీకరణపైనా కూడా మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించారు. అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ మార్గాలపై ఆర్థిక శాఖ స్పెషల్సీఎస్రామకృష్ణారావు మీటింగ్ లో వివరించారు.
రుణమాఫీతో దాదాపు 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. విధివిధానాల ఖరారు తర్వాత ఈ సంఖ్య కొంత అటుఇటుగా ఉండే అవకాశం ఉంది. రుణమాఫీ కోసం ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఒకేసారి రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు వరకు అప్పు తీసుకోవాలని మంత్రివర్గంలో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. మిగిలిన మొత్తాన్ని వివిధ రూపాల్లో సమకూర్చుకోనున్నట్టు తెలిసింది.